వేసవి తాపానికి కార్యాచరణ | - | Sakshi
Sakshi News home page

వేసవి తాపానికి కార్యాచరణ

Apr 9 2026 7:17 AM | Updated on Apr 9 2026 7:17 AM

డాబాగార్డెన్స్‌ : జీవీఎంసీ అన్ని జోన్ల పరిధిలో 198 చలివేంద్రాలు, 52 గ్రీన్‌ షెల్టర్ల ఏర్పాటుకు చర్యలు చేపట్టామని జీవీఎంసీ అదనపు కమిషనర్‌ పి.నల్లనయ్య తెలిపారు. బుధవారం జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో హీట్‌ వేవ్స్‌ యాక్షన్‌ ప్లాన్‌పై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేసవి దృష్ట్యా జీవీఎంసీ పరిధిలో ఏర్పాటు చేయనున్న చలివేంద్రాల్లో తాగునీటితో పాటు ఓఆర్‌ఎస్‌ ప్యాకెట్లను ప్రజలకు అందివ్వనున్నట్లు తెలిపారు. స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి జీవీఎంసీ యంత్రాంగాన్ని సంప్రదిస్తే చలివేంద్రం ఏర్పాటుకు సహకరిస్తామని, ఆ కేంద్రాల్లో మజ్జిగ పంపిణీ చేయాలని సూచించారు. పారిశుధ్య కార్మికులు ఉదయం 5.30 నుంచి 10.30 వరకు, తిరిగి సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు విధులు నిర్వహించేలా చర్యలు చేపట్టామని, భవన యజమానులు భవన నిర్మాణ కార్మికులకు వారు పనిచేసిన చోట చల్లని తాగునీరు ఏర్పాటు చేసేలా చర్యలు చేపట్టాలని జోనల్‌ కమిషనర్లను ఆదేశించారు. పక్షులు, పశువుల రక్షణ దిశగా నీటి తొట్లను ఏర్పాటు చేసేందుకు ప్రజల్లో అవగాహన కల్పించాలని సూచించారు. ప్రస్తుతం జలాశయాల్లో జూలై వరకు సరిపడినంత నీరు సమృద్ధిగా ఉందని పర్యవేక్షక ఇంజనీర్‌ ఏడుకొండలు తెలిపారు. కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్లు, సహాయక వైద్యాధికారులు, నీటి సరఫరా విభాగం ఇంజనీర్లు, జేఆర్‌ నగర్‌ నివాసిత సంక్షేమ సంఘం ప్రతినిధి కేఎస్‌ఆర్‌ మూర్తి, స్వచ్ఛ విశాఖ అంబాసిడర్‌ డీఎస్‌ ఆనంద్‌, గ్రీన్‌ క్‌లైమేట ఆర్గనైజేషన్‌ ప్రతినిధి జేవీ రత్నం తదితరులు పాల్గొన్నారు.

జీవీఎంసీ అదనపు కమిషనర్‌ నల్లనయ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement