ఉల్లాసంగా ఏయూ కల్చరల్ ఫెస్ట్
మద్దిలపాలెం: ఆంధ్ర విశ్వవిద్యాలయం శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న కల్చరల్ ఫెస్ట్ రెండో రోజు మంగళవారం హుషారుగా సాగింది. విద్యార్థుల ఉత్సాహం, కళాకారుల ప్రతిభతో ఏయూ ప్రాంగణం సాంస్కృతిక వేదికగా మారింది. యువ గాయనీ గాయకులు సాయి దేవ హర్ష, వాగ్దేవి తమ గాత్రంతో యువతను ఉర్రూతలూగించారు. వారు పాడిన హిట్ గీతాలకు విద్యార్థులు స్టెప్పులేస్తూ కేరింతలు కొట్టారు. ఏయూ అనుబంధ కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన జానపద, సినీ నృత్యాలు ఆహూతులను మంత్రముగ్ధులను చేశాయి. సంప్రదాయబద్ధంగా సాగిన ప్రదర్శనలతో పాటు, యువతను ఆకట్టుకునేలా సాగిన వెస్ట్రన్ డ్యాన్స్లు జోష్ నింపాయి. ఈ సందర్భంగా సినీ నటుడు శివాజీ మాట్లాడుతూ.. తన తాత ఏయూ పూర్వ విద్యార్థి అని, ఈ విశ్వవిద్యాలయంతో తన కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని గుర్తుచేసుకున్నారు. ఎంపీ శ్రీభరత్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే మేటి విశ్వవిద్యాలయంగా ఏయూ నిలవాలని, నూతన జ్ఞానాన్ని సృష్టించే కేంద్రాలుగా వర్సిటీలు మారాలని ఆకాంక్షించారు. యూత్ ఫెస్టివల్లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను, రిపబ్లిక్ డే పరేడ్లో పాల్గొన్న ఎన్ఎస్ఎస్ వలంటీర్లను ఇదే వేదికపై ఘనంగా సత్కరించారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్, కల్చరల్ ఫెస్ట్ చైర్మన్ ఆచార్య ఎన్. విజయ్ మోహన్, వైస్ చైర్మన్ ఆచార్య ఎ.పల్లవి, కన్వీనర్ ఆచార్య ఎన్.ఎం. యుగంధర్, ఆశా ఇమ్మానియల్ రాజు, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.


