మద్దిలపాలెం: ‘ఆంధ్ర విశ్వవిద్యాలయంలోకి అడుగుపెట్టినప్పటి నుంచి నా భావోద్వేగాలను ఆపుకోలేకపోతున్నాను. మా నాన్న చదువుకున్న ఈ మహోన్నత విశ్వవిద్యాలయ వందేళ్ల వేడుకల్లో పాల్గొనడం నాకు లభించిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను’ అని సినీ నటుడు రాజీవ్ కనకాల అన్నారు. ఏయూ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మెగా కల్చరల్ ఫెస్ట్ సోమవారం ప్రారంభమైంది. మొదటి రోజు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రాజీవ్ కనకాల మాట్లాడుతూ వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఏయూకు రావడం, ఈ వేడుకల్లో భాగస్వామిని కావడం తనకు లభించిన అతి పెద్ద పురస్కారమని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రదర్శించిన నృత్యాలు ఎంతో గ్రేస్తో, హుషారుగా ఉన్నాయని అభినందించారు. కళలకు, సంస్కృతికి, సాహిత్యానికి విశాఖ నగరం పుట్టినిల్లని.. అటువంటి చోట విశ్వవిద్యాలయం కళలకు ఇస్తున్న ప్రాధాన్యత ఎంతో సంతోషాన్నిస్తోందన్నారు. ఏయూ వీసీ ఆచార్య జి.పి. రాజశేఖర్ మాట్లాడుతూ.. విద్యార్థుల నిబద్ధత, సమష్టి కృషికి ఈ సాంస్కృతిక ప్రదర్శనలే నిదర్శనమని కొనియాడారు. యూనివర్సిటీ చరిత్రలో ఇదొక అపూర్వ ఘట్టమని, యువతలోని ఉత్సాహం ఉత్సవాలకు కొత్త కళను తీసుకువచ్చిందన్నారు. కార్యక్రమంలో పాలక మండలి సభ్యులు ఆచార్య సాంబిరెడ్డి, ప్రిన్సిపాల్స్ ఆచార్య జాలాది రవి, ఆచార్య జి.గిరిజా శంకర్, ఆచార్య సీతామాణిక్యం, ఆచార్య ఎం.శశి, ఆచార్య పద్మశ్రీ, ఆచార్య ఎం.వి.ఆర్.రాజు, నిర్వాహకులు ఆచార్య ఎన్.ఎం.యుగంధర్, ఆచార్య సి.హెచ్.ఆశా ఇమ్మాన్యుయేల్ రాజు తదితరులు పాల్గొన్నారు. అనంతరం ఏయూ విద్యార్థులు, అనుబంధ కళాశాలల విద్యార్థులు ప్రదర్శించిన శాసీ్త్రయ, పాశ్చాత్య నృత్యాలు, యోగా విన్యాసాలు, జానపద కళారూపాలు ఆహూతులను విశేషంగా ఆకట్టుకున్నాయి.


