మహారాణిపేట: పీజీఆర్ఎస్(ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక) ద్వారా ప్రజల నుంచి వచ్చిన వినతుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ ఎం.అభిషిక్త్ కిశోర్ అధికారులను ఆదేశించారు. ఎటువంటి జాప్యం లేకుండా, నాణ్యమైన రీతిలో ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని స్పష్టం చేశారు. కలెక్టరేట్ మీటింగ్ హాలులో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్లో డీఆర్వో ఎం.విశ్వేశ్వర నాయుడు, ఏడీసీ సత్యవేణిలతో కలిసి ఆయన ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుల పరిష్కారంలో చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు ఆయన స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. అధికారులు పిటిషనర్లతో నేరుగా మాట్లాడాలని, పదే పదే వచ్చే ఫిర్యాదుల విషయంలో సునిశిత పరిశీలన చేయాలని సూచించారు. నిర్దేశించిన గడువు దాటక ముందే సమస్యలను పరిష్కరించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కాగా.. సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 334 వినతులు నమోదయ్యాయి. రెవెన్యూ శాఖకు 59, జీవీఎంసీకి 83, పోలీస్ శాఖకు 23, ఇతర శాఖలకు సంబంధించి 169 దరఖాస్తులు వచ్చాయి. రెవెన్యూ క్లినిక్లో ఆర్డీవోలు, తహసీల్దార్లు అర్జీలను స్వీకరించారు. కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.


