జిల్లాలో ఎన్టీఆర్ వైద్య సేవలు ఐదో రోజూ స్తంభించిపోయాయి. ప్రభుత్వం నుంచి సుమారు రూ. 400 కోట్ల బకాయిలు రాకపోవడంతో, నెట్వర్క్ ఆస్పత్రుల యాజమాన్యాలు సేవల పట్ల ఆసక్తి చూపలేదు. ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్ (ఆషా) పిలుపు మేరకు బుధవారం నుంచి ఓపీ, ఐపీ సేవలతో పాటు శస్త్రచికిత్సలకు కూడా అంతరాయం నెలకొంది. బకాయిలు చెల్లించకపోతే ఆస్పత్రుల నిర్వహణ సాధ్యం కాదని యాజమాన్యాలు స్పష్టం చేస్తున్నాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చే పేద రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జిల్లా యంత్రాంగం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టినప్పటికీ, రోగుల అవస్థలు మాత్రం తప్పడం లేదు. ఆదివారం చాలా ఆస్పత్రుల్లో ఎన్టీఆర్ వైద్య సేవల కేబిన్లు ఖాళీగా దర్శనమిచ్చాయి. – మహారాణిపేట


