బీజేపీ జెండా ఏర్పాటు వివాదం
వైఎస్సార్ విగ్రహం ముందు ఏర్పాటు చేయడంతోనిరసన వ్యక్తం చేసినవైఎస్సార్సీపీ శ్రేణులు
భారీగా చేరుకున్న పోలీసులు
ఆరిలోవ: నగరంలోని తొమ్మిదో వార్డు జోడుగుళ్లు పాలెం జంక్షన్ శనివారం సాయంత్రం రాజకీయ రణరంగాన్ని తలపించింది. కొద్ది రోజుల్లో జరగనున్న బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సుమారు పదేళ్ల క్రితం ఏర్పాటు చేసిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ముందే బీజేపీ నాయకులు పార్టీ జెండా దిమ్మను నిర్మించి, జెండాను ఆవిష్కరించడం తీవ్ర వివాదానికి దారితీసింది. ఆటో స్టాండ్ స్థలంలో.. వైఎస్సార్ విగ్రహానికి అడ్డుగా ఈ నిర్మాణం చేపట్టడాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులతో పాటు స్థానిక ఆటో డ్రైవర్లు అడ్డుకున్నారు.
టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యంపై విమర్శలు
జీవీఎంసీ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే బీజేపీ నాయకులు ఆగమేఘాల మీద ఈ నిర్మాణం పూర్తి చేశారని వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. సామాన్యులు చిన్న ఇల్లు కట్టుకుంటేనే హడావుడి చేసే టౌన్ ప్లానింగ్ అధికారులు, ఇంత బహిరంగంగా నిబంధనలు ఉల్లంఘిస్తుంటే కన్నెత్తి కూడా చూడకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదు చేసినా ఏసీపీ స్థాయి అధికారులు కూడా స్పందించలేదని వారు మండిపడుతున్నారు.
పోలీసుల భారీ మోహరింపు
పరిస్థితి విషమించడంతో ద్వారకా, నార్త్ ఏసీపీలతో పాటు సుమారు వంద మందికి పైగా పోలీసు సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇరువర్గాల నాయకులను పోలీస్ స్టేషన్కు తరలించి చర్చలు జరిపినప్పటికీ, జెండాను తొలగించే ప్రసక్తే లేదని బీజేపీ నేతలు భీష్మించుకోవడంతో ప్రతిష్టంభన కొనసాగుతోంది. జెండాను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త మొల్లి అప్పారావు నేతృత్వంలో భారీగా తరలివచ్చిన నాయకులు, కార్యకర్తలు ధర్నాకు దిగడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న ఆందోళన స్థానికుల్లో నెలకొంది.


