సాక్షి, విశాఖపట్నం: టీటీడీ చైర్మన్ పదవి నుంచి బీఆర్ నాయుడును తొలగించాలని డిమాండ్ చేస్తూ జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నేతలు నిరసనలు చేపట్టారు. జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ నాయుడు చేసిన అపవిత్ర కార్యక్రమాలు బయటికి వచ్చినా.. ఇంకా ఆయన్ని టీటీడీ చైర్మన్ గా కొనసాగించడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ నేతలు ఆక్షేపించారు. అలాంటి వ్యక్తిపై కనీస చర్యలు కూడా తీసుకోలేని అసమర్ధ సీఎం చంద్రబాబునాయుడు అని విమర్శించారు. బీఆర్ నాయుడు పదవిని అడ్డం పెట్టుకుని రాజకీయ లబ్ధిపొందాలని చూస్తున్నాడని దుయ్యబట్టారు. ప్రపంచవ్యాప్తంగా హిందూ భక్తులు, నెటిజన్ల విమర్శలను కూడా సీఎం పట్టించుకోవట్లేదని మండిపడ్డారు. మురళీనగర్లో గల శ్రీ వైభవ వేంకటేశ్వర స్వామి ఆలయం వద్ద, పద్మనాభం మండల పరిధిలో ఉన్న శ్రీ అనంతపద్మనాభ స్వామి దేవాలయం వద్ద, తూర్పు నియోజకవర్గంలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద, దక్షిణ నియోజకవర్గంలోని అన్ని వార్డుల్లోని దేవాలయాల వద్ద, పశ్చిమ నియోజకవర్గంలోని విమాననగర్ పరిధిలో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద, వడ్లపూడి పరిధిలో ఉన్న శ్రీ ప్రసన్న వేంకటేశ్వర స్వామి దేవాలయం వద్ద ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.


