మద్దిలపాలెం : తొలి తెలుగు పదకవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల 523వ వర్ధంతిని పురస్కరించుకొని ఆదివారం కళాభారతి ఆడిటోరియంలో అన్నమయ్య కీర్తనల గాన సభ ఘనంగా జరిగింది. త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రముఖ అన్నమాచార్య కీర్తన కళాకారులు ‘చైతన్య బ్రదర్స్’(కృష్ణమాచార్య, వెంకటేశ్వర శర్మ) తమ 23 మంది శిష్యులతో కలిసి అన్నమయ్య కీర్తలను ఆలపించి శ్రోతలను మంత్రముగ్ధులను చేశారు. ఈ సంగీత విభావరికి డాక్టర్ మావుడూరి సత్యనారాయణ శర్మ (వయోలిన్), ఏడుకొండలు (మృదంగం), రాజు (తబలా) వాద్య సహకారం అందించారు. అంతకుముందు, కళాభారతి, త్యాగరాజ ఆరాధన ట్రస్ట్ అధ్యక్షుడు మంతెన సత్యనారాయణ రాజు, కార్యదర్శి డాక్టర్ గుమ్ములూరి రాంబాబు, కోశాధికారి పైడా కృష్ణప్రసాద్, వంతుల నరసింగరావు, చైతన్య సోదరులు జ్యోతి ప్రజ్వలన చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అన్నమయ్య సంకీర్తనల విశిష్టతను చాటిచెప్పేలా సాగిన ఈ వేడుక నగర సంగీత ప్రియులను విశేషంగా ఆకట్టుకుంది.


