ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్
అల్లిపురం: న్యాయవాద వృత్తిలో విలువలకు, నిబద్ధతకు నిలువుటద్దం దివంగత సీనియర్ న్యాయవాది సి.పద్మనాభరెడ్డి అని ఏపీ హైకోర్టు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్ కొనియాడారు. వర్ధమాన న్యాయవాదులు ఆయనను స్ఫూర్తిగా తీసుకుని వృత్తిలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని సూచించారు. శనివారం జిల్లా కోర్టు సముదాయంలోని బార్ అసోసియేషన్ హాల్లో ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ లాయర్స్ విశాఖ జిల్లా, సిటీ కమిటీల ఆధ్వర్యంలో పద్మనాభరెడ్డి స్మారకోపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జస్టిస్ మానవేంద్రనాథ్ రాయ్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పద్మనాభరెడ్డి గారు ఒక ధ్రువతారలా వెలిగారని, ఆయన వాదనా పటిమ, చట్టంపై ఆయనకున్న పట్టు అనన్య సామాన్యమని గుర్తుచేశారు. విశిష్ట అతిథులుగా పాల్గొన్న ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రవి చీమలపాటి, తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నాగేష్ భీమపాక ప్రసంగిస్తూ.. పద్మనాభరెడ్డి గారు కేవలం గొప్ప న్యాయవాదే కాకుండా, ఎంతోమందికి మార్గదర్శకుడిగా నిలిచారని ప్రశంసించారు. రిటైర్డ్ జస్టిస్ సి.ప్రవీణ్ కుమార్ (పద్మనాభరెడ్డి కుమారుడు) తన తండ్రి జ్ఞాపకాలను పంచుకున్నారు. విశాఖపట్నం బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.కె.శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ లాలం పార్వతినాయుడు, ఐఏఎల్ నేషనల్ జనరల్ సెక్రటరీ చలసాని అజయ్కుమార్, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు ముప్పాళ్ల సుబ్బారావు ప్రసంగించారు. కార్యక్రమంలో ఐఏఎల్ నాయకులు వి.చంద్రశేఖరరెడ్డి, కె.ఎస్.సురేష్ కుమార్, ఎం.ఎస్.ఎం.భగవతీ, డి.మంజులత, ఎ.వి.లెనిన్, జహారా, అజయ్కుమార్, పీర్ల నూకరాజు, న్యాయవాదులు పాల్గొన్నారు.


