సముద్రయాన ఐక్యతకు విశాఖ వేదిక
గవర్నర్ అబ్దుల్ నజీర్
ఏయూక్యాంపస్: నేటి అనుసంధానిత ప్రపంచంలో సముద్రాలు ఆర్థిక వ్యవస్థలను, సంస్కృతులను కలుపుతున్నాయని రాష్ట్ర గవర్నర్ ఎస్. అబ్దుల్ నజీర్ అన్నారు. గురువారం బీచ్రోడ్డులో జరిగిన ఇంటర్నేషనల్ సిటీ పరేడ్లో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన ప్రసంగించారు. సముద్ర జలాలు వివాదాలకు కాదు, అభివృద్ధి, సహకారానికి వేదికలవ్వాలని పేర్కొన్నారు. వివిధ దేశాల నౌకలు వేర్వేరు జెండాలతో ప్రయాణించినా, ఒకే సముద్రాన్ని పంచుకుంటున్నాయని, అదే బాధ్యతను గుర్తు చేస్తుందని చెప్పారు. భారత నౌకాదళం, ఆర్మీ, ఎయిర్ఫోర్స్, కోస్ట్ గార్డ్ బృందాల క్రమశిక్షణ, నైపుణ్యం దేశ ఐక్యతకు ప్రతీకలని తెలిపారు. విదేశీ నౌకలు, సైనిక బృందాల పాల్గొనడం దేశాల మధ్య స్నేహం, నమ్మకానికి నిదర్శనమన్నారు. విశాఖపట్నం తూర్పు తీరానికి సముద్రయాన గుండెకాయగా, అంతర్జాతీయ సముద్ర నగరంగా ఎదుగుతోందన్నారు. తూర్పు నావికాదళ చీఫ్ సంజయ్ భల్లా మాట్లాడుతూ ఇంటర్నేషనల్ ఫ్లీట్ రివ్యూ, మిలాన్ వంటి కార్యక్రమాలు ప్రపంచ నౌకాదళాల మధ్య సహకారం, స్నేహాన్ని బలపరుస్తాయని చెప్పారు. ప్రపంచ సముద్రాల్లో అనిశ్చితి నెలకొన్న సమయంలో మిత్ర దేశాలతో కలిసి పనిచేయడానికి భారత నౌకాదళం కట్టుబడి ఉందన్నారు.


