
పత్రికా స్వేచ్ఛను హరిస్తామంటే ఎలా?
ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు అధికార యంత్రాంగం, ప్రభుత్వాల దృష్టికి తీసుకురావడంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుంది. అలాంటి పత్రికల స్వేచ్ఛను పోలీసు కేసులతో ప్రభుత్వం హరిస్తామంటే ఎలా..? ఇటీవల సాక్షిలో ఒక రాజకీయ పార్టీ నేత మాట్లాడిన ప్రెస్మీట్ను వార్తగా రాస్తే.. సంబంధిత జర్నలిస్టుపై, ఎడిటర్ ఆర్.ధనంజయరెడ్డిపై అక్రమ కేసు పెట్టి ప్రభుత్వం వేధిస్తోంది. ప్రజల గొంతుకగా నిలిచే మీడియా గొంతును నులిమే ప్రయత్నాలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతోంది. అక్షరాన్ని, భావ ప్రకటనా స్వేచ్ఛను నోటీసులు, అక్రమ కేసులతో పోలీసులు నిరోధించలేరు. మొదటి నుంచి కూటమి ప్రభుత్వం వాస్తవాలను వెలుగులోకి తెస్తున్న సాక్షిపై వేధింపుల ధోరణికే పాల్పడుతోంది. ఈ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. పత్రికలపై కక్ష కట్టిన ఏ నాయకుడూ బాగుపడిన దాఖలా చరిత్రలో లేదు. – కరణం ధర్మశ్రీ, ప్రభుత్వ మాజీ విప్
రాజ్యాంగాన్ని గౌరవించడం లేదు
ప్రపంచంలోనే అత్యంత దృఢమైనదని భారత రాజ్యంగానికి పేరు. అలాంటి రాజ్యాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం గౌరవించడం లేదు. ప్రజలకు వాస్తవాలు తెలియకుండా ఉండడానికే మీడియాను అణగదొక్కుతున్నారు. రాజ్యాంగం ఇచ్చిన భావ ప్రకటనా స్వేచ్ఛను హరించేస్తున్నారు. ఒక రాజకీయ నాయకుడి ప్రెస్మీట్ను వార్తగా రాస్తే కేసు ఎలా నమోదు చేస్తారు? ఇది ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసినట్లే. రాజకీయ పార్టీల నాయకులు ప్రెస్మీట్ల ద్వారా వెల్లడించిన అంశాలను వార్తగా మలిచే హక్కు జర్నలిస్టులకు ఉంటుంది. నాయకులు మీడియా సమావేశాలు పెట్టి అనేక అంశాలు మాట్లాడతారు. వాటిని వార్త రూపంలో ప్రజలకు చేరవేయడంతో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తారు. అంతమాత్రాన వార్త రాసిన జర్నలిస్టుపై, పత్రిక ఎడిటర్పై కేసులు నమోదు చేసి వేధింపులకు గురిచేయడం సరికాదు. – తైనాల విజయకుమార్, మాజీ ఎమ్మెల్యే

పత్రికా స్వేచ్ఛను హరిస్తామంటే ఎలా?

పత్రికా స్వేచ్ఛను హరిస్తామంటే ఎలా?