
వాల్తేరు డివిజన్లో అభివృద్ధి పనులపై సమీక్ష
తాటిచెట్లపాలెం: వాల్తేరు డివిజన్లో జరుగుతున్న సివిల్ ఇంజనీరింగ్ విభాగం పనులపై డీఆర్ఎం డివిజనల్ రైల్వే మేనేజర్ లలిత్ బొహ్రా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఆధునీకరించిన సివిల్ ఇంజనీరింగ్ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరిగింది. రైల్వే భద్రతకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని అధికారులకు సూచించారు. రద్దీ సీజన్లలో వివిధ విభాగాల మధ్య సమన్వయం మెరుగుపరుచుకోవడం ద్వారా డివిజన్ పనితీరు మరింత మెరుగవుతుందని ఆయన తెలిపారు. సమీక్షలో భాగంగా మౌలిక సదుపాయాల అభివృద్ధి, నిర్వహణ పనులు, అమృత్ భారత్ స్టేషన్ పనులు, ప్రకృతి వైపరీత్యాల సమయంలో చేపట్టాల్సిన చర్యలు, కొండచరియల ప్రాంతాలలో భద్రతా పనుల గురించి చర్చించారు.
సమావేశానికి ముందు డీఆర్ఎం ఆధునీకరించిన సమావేశ మందిరాన్ని ప్రారంభించారు. సమావేశంలో ఏడీఆర్ఎంలు ఈ. శాంతారాం, మనోజ్ కుమార్ సాహూ, సీనియర్ డివిజనల్ ఇంజనీర్ కె. మహరాణా పాల్గొన్నారు.