జీ హుజూరు! | - | Sakshi
Sakshi News home page

జీ హుజూరు!

Jun 6 2025 12:39 AM | Updated on Jun 6 2025 12:39 AM

జీ హుజూరు!

జీ హుజూరు!

బెహరాకు

నేటి కౌన్సిల్‌లో కీలక అంశాలు

మేయర్‌ పీలా శ్రీనివాసరావు అధ్యక్షతన జీవీఎంసీ ప్రధాన కార్యాలయ సమావేశ మందిరంలో శుక్రవారం నిర్వహించనున్న కౌన్సిల్‌ సమావేశంలో 27 అంశాలు సభ్యుల ఆమోదానికి చర్చకు రానున్నాయి. వీటితో పాటు మరికొన్ని టేబుల్‌ అజెండా అంశాలు వచ్చే అవకాశం ఉంది. వీటిలో మినిస్టీరియల్‌ విభాగానికి సంబంధించిన అంశాలు, పలు అభివృద్ధి పనులకు, ఇంజనీరింగ్‌ విభాగానికి సంబంధించి పొరుగు సేవల విధానంలో వర్క్‌ ఇన్‌స్పెక్టర్లు, మాస్‌ మజ్దూర్ల సేవలు 2026 మార్చి 31వరకు కొనసాగించేందుకు పరిపాలన ఆమోదం, జోన్‌–4లో యూజీడీలో లోపాల్లేకుండా నిర్వహణకు 6 కేఎల్‌ జెట్టింగ్‌ వాహనాలు సఫాయి కర్మచారీస్‌ ఫైనాన్స్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ నుంచి అంగీకరించేందుకు పరిపాలన ఆమోదంతో పాటు మరికొన్ని అంశాలపై చర్చించి, నిర్ణయం తీసుకోనున్నారు.

డాబాగార్డెన్స్‌ : శ్రీహరిపురంలో ఉన్న ఫస్ట్‌ రిఫరల్‌ యూనిట్‌(ఎఫ్‌ఆర్‌యూ) నెలవారీ ఆపరేషన్స్‌ అండ్‌ మెయింట్‌నెన్స్‌(నిర్వహణకు) బాధ్యతలను ప్రస్తుతమున్న విజయ(బెహరా) వెల్ఫేర్‌ సొసైటీకే అప్పగిస్తూ.. రూ.1.20 కోట్ల మేర చెల్లింపులు చేసేందుకు జీవీఎంసీ పాలకవర్గం సిద్ధమైంది. కుటుంబ సభ్యులు జీవీఎంసీలో కార్పొరేటర్లుగా ఉన్నప్పుడు... కాంట్రాక్టు ఎలా కట్టబెడతారంటూ గతంలో ఇదే కూటమి నేతలు తీవ్ర విమర్శలు చేశారు. కాంట్రాక్టును కేటాయించొద్దుంటూ కౌన్సిల్‌ సమావేశంలో నానా రభస చేశారు. మొన్న జరిగిన మేయర్‌పై అవిశ్వాస తీర్మానం ఓటింగ్‌లో బెహరా భాస్కరరావుతో పాటు ఆయన కుటుంబ సభ్యులు జనసేనలోకి జంప్‌ కావడంతో కూటమికి ప్రీతిపాత్రులయ్యారు. దీంతో మొన్నటిదాకా అక్రమమంటూ పెడబొబ్బలు పెట్టిన ఇదే కూటమి నేతలు ఇప్పుడు ఎర్రతివాచీ పరిచి మరీ కాంట్రాక్టును కట్టబెట్టేందుకు సిద్ధమవుతుండటం గమనార్హం. ఈ మేరకు శుక్రవారం జరగనున్న సమావేశంలో 18వ ఎజెండాగా ఈ కేటాయింపుల అంశాన్ని చేర్చారు. అలాగే టెండర్లు పిలవకుండా ఎలా కేటాయిస్తారని స్థానిక ఎమ్మెల్యే మండిపడుతున్నట్టు తెలిసింది.

అవినీతిపై విచారణ పూర్తి కాకుండానే..

ఓ సీనియర్‌ అసిస్టెంట్‌ వీఆర్‌ఎస్‌కు దరఖాస్తు చేసుకోగా.. అనుమతి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ఈయనపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇంకా విచారణ పూర్తి కాలేదు. అయితే తనను కలిసి దరఖాస్తు చేసుకున్నారంటూ మేయర్‌ ఏకంగా ఎజెండాలో మొదటి అంశంగా చేర్చినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కూడా ఇదే కూటమి నేతలు గతంలో ఆరోపణలు గుప్పించిన విషయాన్ని పలువురు చర్చించుకుంటున్నారు.

ప్రతి నియోజకవర్గం ఓ జోన్‌గా..

27 అజెండా అంశాలతో పాటు మరికొన్ని అంశాలు టేబుల్‌ అజెండాగా సభ్యుల ముందుకు చర్చకు రానున్నాయి. వీటిలో ప్రధానంగా ఇప్పటి వరకు జీవీఎంసీలో 8 జోన్లు ఉన్నప్పటికీ నియోజకవర్గాలకు సంబంధించి సమస్యలు తలెత్తుతున్నాయి. జోన్‌–5 కార్యాలయం జ్ఞానాపురంలో ఉంది. ఈ జోన్‌ పరిధిలోకి దక్షిణ నియోజకవర్గం, పశ్చిమ నియోజకవర్గం, ఉత్తర నియోజకవర్గానికి చెందిన వార్డులు వస్తున్నాయి. దీంతో నియోజకవర్గ సమస్య తలెత్తుతున్న దృష్ట్యా.. జీవీఎంసీ పరిధిలో గల నియోజకవర్గాల కిందకు ఆ నియోజకవర్గానికి చెందిన వార్డులను కేటాయిస్తూ కౌన్సిల్‌ సమావేశం తీర్మానించనుంది. ఇక నుంచి ఏ నియోజకవర్గానికి సంబంధించి, ఆ నియోజకవర్గ జోనల్‌ కార్యాలయంలోనే వ్యవహారాలు సాగనున్నాయి. ఈ అంశాన్ని టేబుల్‌ అజెండాలో పొందుపరిచినట్టు తెలిసింది.

● ఫస్ట్‌ రిఫరల్‌ యూనిట్‌ ఓఅండ్‌ఎంకు రూ.1.2 కోట్లు చెల్లింపు

● గతంలో తీవ్రంగా విమర్శించిన టీడీపీ

● జీవీఎంసీలో కార్పొరేటర్‌గా ఉండి పనులు ఎలా చేస్తారని నిలదీత

● ఇప్పుడు అవే పనుల అప్పగింతకు సిద్ధం

● నేటి కౌన్సిల్‌ సమావేశంలో గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేందుకు నిర్ణయం

కౌన్సిల్‌ సమావేశ మందిరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement