ప్రాణం తీసిన అతి వేగం | - | Sakshi
Sakshi News home page

ప్రాణం తీసిన అతి వేగం

Aug 27 2023 12:42 AM | Updated on Aug 27 2023 9:20 AM

- - Sakshi

విశాఖపట్నం: అతివేగం ఓ విద్యార్థి ప్రాణం తీసింది. అతని నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కారణంగా మరో ఇద్దరు విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. భీమిలి బీచ్‌రోడ్డులో చోటుచేసుకున్న ఈ ఘటన ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నింపింది. భీమిలి పోలీసులు తెలిపిన వివరాలివీ.. లాసన్స్‌బే కాలనీకి చెందిన పెండ్యాల ప్రఖ్యాత్‌(20), సీతమ్మధారకు చెందిన కొల్లా అఖిలేష్‌, ఎండాడకు చెందిన ఆర్‌.సాయిలక్ష్మి స్నేహితులు. రుషికొండలోని గీతం కళాశాలలో ప్రఖ్యాత్‌, అఖిలేష్‌ సీఎస్సీ మూడో సంవత్సరం.. సాయిలక్ష్మి బీబీఏ చదువుతున్నారు.

వీరు ముగ్గురూ శనివారం ఉదయం కళాశాలలో కలుసుకుని ఒకే కారులో భీమిలిలో టిఫిన్‌ చేసేందుకు వెళ్లారు. తిరిగి వస్తుండగా ఐఎన్‌ఎస్‌ కళింగ సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీ కొట్టి.. అక్కడే ఉన్న చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రఖ్యాత్‌కు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే గీతం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు.

వెనుక సీటులో ఉన్న అఖిలేష్‌, సాయిలక్ష్మి గాయాలతో బయటపడ్డారు. వీరికి గీతంలో చికిత్స అందించి ఇంటికి పంపించేశారు. ప్రఖ్యాత్‌ అతి వేగంగా కారు నడుపుతూ అదుపు చేయలేక డివైడర్‌ను ఢీ కొట్టడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. ప్రఖ్యాత్‌ తండ్రి అరవింద్‌ నగరంలో బిజినెస్‌మన్‌. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. భీమిలి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రఖ్యాత్‌ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించారు. ఎస్‌ఐ భరత్‌ కుమార్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement