తాండూరు రూరల్: తాండూరు మండలం గౌతాపూర్ గ్రామానికి చెందిన ఈడ్గి విజయంకిత ఎంబీబీఎస్లో సీటు సాధించింది. నీట్ ప్రవేశ పరీక్షల్లో 443 మార్కులతో రాష్ట్రస్థాయిలో 3,730, ఆలిండియాలో 1,79,561 ర్యాంక్ సాధించింది. రెండో కౌన్సెలింగ్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలో సీటు దక్కించుకుంది. విజయంకిత తండ్రి మూడేళ్ల క్రితమే మృతిచెందగా, తల్లి రాధిక తన ఇద్దరు పిల్లలను చదివిస్తోంది.
వ్యక్తి ఆత్మహత్య
యాలాల: ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో ఓ వ్యక్తి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మండలంలోని నాగసముందర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. ఎస్ఐ విఠల్రెడ్డి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన బొక్కెన ఆశప్ప(45) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వాడు. కుటుంబంలో ఆర్థిక పరిస్థితులు అంతంతా మాత్రంగానే ఉండటంతో మనస్థాపానికి గురయ్యేవాడు. ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున ఆశప్ప భార్య బహిర్భూమికి వెళ్లిన సమయంలో ఇంట్లో దూలానికి వైరుతో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
ప్రతిష్ఠించకుండానే నిమజ్జనం
కుల్కచర్ల: స్థానికంగా నెలకొన్న విభేదాల కారణంగా వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్టించకుండానే నిమజ్జనం చేశారు. ఈ ఘటన పీరంపల్లిలో సోమవారం చోటుచేసుకుంది. గ్రామా నికి చెందిన ఓ వర్గం వారు వినాయక ప్రతిమను గ్రామానికి తీసుకువచ్చారు. కోర్టు పరిధిలో ఉన్న భూమిలో విగ్రహ ప్రతిష్ఠ తగదని మరో వర్గం వారు ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ రమేష్ గ్రామానికి చేరుకుని ఇరువర్గాలకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. విగ్రహ ఏర్పాటుకు రెండో వర్గం వారు నిరాకరించడంతో స్వామివారిని ప్రతిష్ఠించేందుకు తెచ్చిన మరో వర్గం వారు నేరుగా చెరువు వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేశారు.


