● ‘ఏడబ్ల్యూడీ’తో సాగునీటి ఆదా
● జిల్లా వ్యవసాయాధికారి రాజారత్నం
బషీరాబాద్: పంటల సాగులో రసాయన ఎరువుల వాడకాన్ని గణనీయంగా తగ్గించాలని జిల్లా వ్యవసాయ అధికారి రాజరత్నం రైతులకు సూచించారు. బుధవారం మండలంలోని కాశీంపూర్ రైతువేదికలో ‘రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రసాయన ఎరువులు వాడడం వలన భూమి సారం తగ్గిపోయి పంట ఉత్పాదక శక్తి తగ్గుతుందన్నారు. పురుగు మందుల ప్రభావం వలన పంటలకు మేలు చేసే వానపాములు, మిత్ర పురుగులు నశిస్తున్నాయని వివరించారు. రైతులు ప్రతీ ఏడాది పంట మార్పిడి తప్పని సరిగా చేసుకోవాలని సూచించారు. తాండూరు వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ పరిమళ మాట్లాడుతూ.. రైతులు యూరియా వాడకాన్ని తగ్గించాలని సూచించారు. మార్కెట్లో డిమాండ్ ఉన్న మేలైన వరిరకాలను సాగు చేసి ఆదాయం పొందాలన్నారు. వరి సాగులో ఆల్టర్నేట్ వెట్టింగ్ అండ్ డ్రైయింగ్ (ఏడబ్ల్యూడీ) పద్ధతిని అనుసరించడం వలన సాగునీటిని ఆదా చేసుకోవచ్చని చెప్పారు. స్ప్రింక్లర్, డ్రిప్ ఇరిగేషన్ వంటి బిందు సేద్య పద్ధతులను అవలంబించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ శంకర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి అనిత, యంగ్ ప్రొఫెషనల్స్ సల్మాన్, కేశవ, కృష్ణ, ఏఈఓలు సౌమ్య, సామేల్, వసీం, ప్రవీణ్, విజయ్, నవీన్, వివిధ గ్రామాల సర్పంచ్లు, రైతులు పాల్గొన్నారు.


