● కవి వడిచర్ల సత్యం
● కవి ఊర ఈశ్వరరెడ్డికి సన్మానం
బొంరాస్పేట: మాత్రా ఛందస్సులో ఉన్న మణిపూసలు సాహిత్య ప్రక్రియకు దక్కుతున్న ఆదరణ అద్వితీయమని మణిపూసలు సృష్టికర్త మండల పరిధిలోని వడిచర్లకు చెందిన కవి వడిచర్ల సత్యం అన్నారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం కోవెలదిన్నెకు చెందిన ప్రముఖ కవి ఊర ఈశ్వరరెడ్డి రచించిన ‘అక్షర మణిపూసలు’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంత సాహిత్య సాంస్కృతిక వేదిక కార్యవర్గం సమక్షంలో పుస్తకావిష్కరణ చేశారు. పుస్తక రచయితనుద్దేశించి కవి వడిచర్ల మాట్లాడుతూ.. మూడేళ్లుగా అనారోగ్యంతో మంచానికి పరిమితమై ఉన్నా అక్షర మణిపూసలు పుస్తకం రాయడం అభినందనీయమన్నారు. ఈశ్వరరెడ్డి రచించిన వెంకటేశ్వర ద్విశతి, చెన్నకేశవ శతకం, కవితా లహరి, సమస్యాపూరణం, ముక్తపదం వంటి పద్యగ్రంథాలను కొనియాడారు. అచేతన స్థితిలో ఉండికూడా మణిపూసలు సాహిత్య రచన చేయడం పట్ల అనంతవేదిక ప్రతినిధులు ఈశ్వరరెడ్డిని అభినందించి సన్మానించారు. ఇందులో అనంత వేదిక అధ్యక్షుడు ఆశీర్వాదం, పాలమూరు జిల్లా అనుపటి రాంచంద్రయ్య, హనుమంతు సుమాల తదితరులున్నారు.


