తాండూరు టౌన్: దేశ భవిష్యత్ యువత చేతుల్లోనే ఉందని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య అన్నారు. మంగళవారం పట్టణంలోని శాలివాహన డిగ్రీ కళాశాల తృతీయ సంవత్సర విద్యార్థుల వీడ్కోలు వేడుకలు స్థానిక తులసీ గార్డెన్ ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డీఎస్పీ మాట్లాడుతూ ఆధునిక ప్రపంచంలో నూతన ఆవిష్కరణలతో యువత ముందు దూసుకు పోతోందన్నారు. విద్యార్థులు ఇష్టమైన రంగాన్ని ఎంచుకుని, నిర్ణయించుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు శ్రమించాలన్నారు. మీరు చేరిన ఉన్నత స్థానంతో తల్లిదండ్రులకు, కళాశాలకు గొప్ప కీర్తి ప్రతిష్టలు చేకూరుతాయన్నారు. సన్మార్గంలో నడిచి ఉత్తమ పౌరులుగా పేరు తెచ్చుకోవాలని సూచించారు. అనంతరం కళాశాల ప్రిన్సిపాల్ శరత్ చంద్ర మాట్లాడుతూ.. కళాశాలలో క్రమశిక్షణ, అత్యుత్తమ బోధనతో పాటు నైతిక విలువలు, సంస్కృతి, సంప్రదాయాలకు పెద్దపీట వేస్తున్నామన్నారు. అకాడమిక్ ఫలితాల్లో విద్యార్థులు విజయదుందుభి మోగిస్తున్నారన్నారు. అనంతరం విద్యార్థులకు నిర్వహించిన స్పోర్ట్స్ మీట్లో విజేతలకు బహుమతులు అందజేశారు. విద్యార్థులు సాంస్కృతిక ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల మండలి అధ్యక్షుడు కల్వ రాధాకృష్ణ, కరస్పాండెంట్ మోముల మాణిక్యం, డైరెక్టర్లు సుధాకర్, వీరేందర్, మల్లేశం, రాధమ్మ, అకడమిక్ డైరెక్టర్ సిద్ధిలింగయ్య, అధ్యాపకులు తదితరులు పాల్గొన్నారు.
డీఎస్పీ నర్సింగ్ యాదయ్య


