డీసీసీ అధికార ప్రతినిధి గోపాల్
తాండూరు: ఆర్టీసీ కార్మికుల పక్షపాతి సీఎం రేవంత్రెడ్డి అని డీసీసీ అధికార ప్రతినిధి గోపాల్ అన్నారు. సోమవారం తాండూరు ఆర్టీసీ డిపో ప్రాంగణంలో కార్మికులతో కలిసి అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేతన సవరణతో 37,360 మంది కార్మికులకు ప్రయోజనం చేకూరిందన్నారు. 2021 ఏప్రిల్ నుంచి ప్రయోజనాలు వర్తించడం హర్షనీయమన్నారు. ఉద్యోగ విరమణ పొందిన వారికి ఈ ప్రయోజనాలు వర్తించేలా సీఎం నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. వేతన సవరణతో కండక్టర్లకు రూ.4 వేల నుంచి 15 వేల వరకు, డ్రైవర్లకు రూ.4 వేల నుంచి రూ.17 వేల వరకు వేతనాలు పెరగనున్నాయని పేర్కొన్నారు. ఆర్థిక భారం అయినప్పటికీ.. కార్మికుల కోసం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమన్నారు. కార్యక్రమంలో కార్మికులు, కాంగ్రెస్ నాయకులు తదితరులున్నారు.


