న్యూస్రీల్
అంచనాలు సిద్ధం చేసిన వ్యవసాయ శాఖ పత్తి, జొన్న, మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం అవసరమైన విత్తనాలు 54,2400 క్వింటాళ్లు ఎరువులు 75,437 మెట్రిక్ టన్నులు
కొరత లేకుండా చూస్తాం
ఆదివారం శ్రీ 26 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026
5.97
వికారాబాద్: వ్యవసాయ శాఖ ఖరీఫ్ సాగుకు కసరత్తు ప్రారంభించింది. క్షేత్ర స్థాయి అధికారులు, అనుబంధ శాఖల అధికారులతో సంప్రదించి ప్రణాళికలో అనుసరించాల్సిన విషయాలను చర్చించింది. గత సీజన్లో సాగు విస్తీర్ణం ఎంత..? ఏయే పంటలు ఎంత మేర సాగయ్యాయి. ఈ సీజన్లో ఏయే పంటల సాగు విస్తీర్ణం పెంచాలి.. ఏయే పంటలు తగ్గించాలి.. రైతులకు ఏయే అంశాలపై అవగాహన కల్పించాలి అనే విషయాలు చర్చించారు. డివిజన్లు, మండలాల వారీగా కావాల్సిన ఎరువులు. అందుబాటులో ఉంచాల్సిన ఎరువులు వంటి వాటిపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. భూసార పరీక్షలు, విత్తనాల ఎంపిక, నాణ్యమైన విత్తనాల కొనుగోలు, అందుబాటులో ఉన్న ఎరువులు తదితర వివరాలు రైతులకు తెలియజేయాల్సి ఉంటుంది. అయితే రైతు చైతన్య యాత్రలు ఉంటాయా..? ఉండవా అనే దానిపై అధికారులు ఇప్పటి వరకు స్పష్టత ఇవ్వడంలేదు. ప్రస్తుతం ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమం కొనసాగుతుండగా.. ఇందులో భాగంగా మే చివరి వారం లేదా జూన్ మొదటి వారంలో రైతు అవగాహన సదస్సులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు సమాచారం. నకిలీ విత్తనాలు, పురుగు మందులపై రైతులను అప్రమత్తం చేసే కార్చాచరణను రూపొందిస్తున్నారు. ఇప్పటికే మార్కెట్లో కొందరు వ్యాపారులు బీటీ –3 పత్తి విత్తనాలను గుట్టుగా విక్రయించేందుకు తిరుగతున్నారు. గతంలో ప్రభుత్వమే పలు రకాల విత్తనాలు, వ్యవసాయ యంత్ర పరికరాలను రాయితీపై అందించేది. ఐదారేళ్లుగా ఈ పథకాలను అమలు చేయడం లేదు. ప్రస్తుత ప్రభుత్వమైనా రాయితీలు ఇస్తుందా లేదా అనేది తెలియడం లేదు. రైతులు మాత్రం రాయితీపై విత్తనాలు, యంత్ర పరికరాలు ఇవ్వాలని కోరుతున్నారు.
సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం
రానున్న ఖరీఫ్ సీజన్లో జిల్లా రైతులు 5.97 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయవచ్చని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. గత ఏడాది 2.61 లక్షల ఎకరాల్లో పత్తి పంట సాగు చేయగా.. ఈ సారి స్వల్పంగా(2. 63 లక్షల ఎకరాలు) పెరగవచ్చని భావిస్తున్నారు. కంది 1.50 లక్షల ఎకరాలు, వరి 1.10 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 50,450 ఎకరాలు, పెసలు 13వేల ఎకరాలు, మినుములు 5వేల ఎకరాలు, జొన్నలు 2,500 సాగవుతుందని అంచనా వేస్తున్నారు. వరి, మొక్కజొన్న, జీలుగు, జనుము, సోయాబీన్, కంది విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో పత్తి పంటను అధిక విస్తీర్ణంలో సాగు చేసే అవకాశం ఉండటంతో అవసరం మేరకు విత్తనాలను అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా లైసెన్స్డ్ ఫర్టిలైజర్, సీడ్స్ దుకాణాలకు ఆదేశాలు జారీ చేశారు. ఎరువులు, విత్తనాలు ఎంత మేర అవసరం అనే విషయాన్ని అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చారు.
అంచనాలు సిద్ధం
ఎరువుల విషయానికొస్తే.. డీఏపీ 17,719 మెట్రిక్ టన్నులు, యూరియా 32,329 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 19,877 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 3,658 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 1,854 మెట్రిక్ టన్నులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేశారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించి 75,437 మెట్రిక్ టన్నుల ఎరువులు, 54,2400 క్వింటాళ్ల విత్తనాలు కావాల్సి ఉంటుందని అంచనాలు సిద్ధం చేశారు.
ఖరీఫ్ సాగు ప్రణాళిక
ప్రస్తుత ఖరీఫ్ సీజన్కు అవసరమైన విత్తనాలు, ఎరువులు అందుబాటులో ఉంచుతాం. కొరత లేకుండా చూస్తాం. విత్తనాలు, ఎరువులు కొనుగోలు చేస్తే బిల్లులు తప్పనిసరిగా తీసుకోవాలి. బీటీ – 3 గ్లైసిల్ పత్తి విత్తనాలను ప్రభుత్వం నిషేధించింది. నకిలీ విత్తనాలు అమ్మితే చర్యలు తీసుకుంటాం. రైతులు జాగ్రత్తగా ఉండాలి.
– రాజరత్నం, జిల్లా వ్యవసాయాధికారి


