అనంతగిరి: భూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్ దీపక్ తివారి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అన్ని మండలాల తహసీల్దార్లతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూ సమస్యలను సత్వరం పరిష్కరించడానికి ప్రభుత్వం భూభారతి చట్టాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు. పెండింగ్ దరఖాస్తుల పరిష్కారానికి జిల్లా, మండల స్థాయిలో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని ఆదేశించారు. భూస్వామ్య మార్పులు, పాస్బుక్ అప్డేషన్, ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాల్లో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా సేవలందించాలన్నారు. పెండింగ్ దరఖాస్తును సమీక్షించి, నిర్దిష్ట కాలవ్యవధిలో పరిష్కరించాలన్నారు. సాదా బైనామా, మ్యుటేషన్, భూ సమస్యలను పరిష్కరించి మాడ్యుల్ వారీగా రిపోర్ట్ ఇవ్వాలని ఆదేశించారు. జిల్లాలోని అర్బన్ ఏరియాల్లో జనగణనపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బీఎల్ఓలు, ఏఆర్ఓలు ఇండ్ల గణన ప్రక్రియ, మ్యాప్ తయారీ ప్రక్రియను పోలింగ్ స్టేషన్ వారీగా సక్రమంగా నిర్వహించాలన్నారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి గణన చేయాలని తెలిపారు. ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఇసుక అక్రమ రవాణాపై గట్టి నిఘా పెట్టాలన్నారు. అనుమతి ఉన్న రీచ్ల నుంచి ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు అన్ని పత్రాలు చూసి ఇసుక రవాణాకు పర్మిషన్ ఇవ్వాలని తెలిపారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ వెంకటాచారి, ఆర్డీఓలు అనిత, వాసుచంద్ర, మైనార్టీ వెల్ఫేర్ అధికారి రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
డబుల్ ఇళ్లను అందుబాటులోకి తెస్తాం
తాండూరు రూరల్: పట్టణ శివారులో అసంపూర్తిగా ఉన్న డబుల్ బెడ్రూం ఇళ్లను నెల రోజుల్లో పూర్తి చేసి, ప్రజలకు అందుబాటులోకి తెస్తామని కలెక్టర్ దీపక్ తీవారి అన్నారు. శుక్రవారం ఖాంజాపూర్ని ఇళ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాండూరుకు 1,001 డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు కాగా 585 ఇళ్లను పూర్తి చేశామన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు నిర్మించినట్లు చెప్పారు. తాగునీరు, విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నెల రోజుల్లో పనులు పూర్తి కావాలని సూచించారు. అనంతరం చిలుకవాగు పనులను, కాగ్నా నది వద్ద తాగునీటి పంప్హౌస్ పరిశీలించారు. కార్యక్రమంలో పంచాయతీ రాజ్ ఈఈ శ్రీనివాస్ రెడ్డి, హౌసింగ్ డీఈ ఖలీమొద్దీన్, పీఆర్ డీఈ నాగభూషణం, ఏఈ నందిని, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
నిర్దిష్ట కాలవ్యవధిలో పరిష్కరించాలి
కలెక్టర్ దీపక్ తివారి


