ఇబ్రహీంపట్నం రూరల్: ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చాక విస్మరించిందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్గౌడ్ అన్నారు. హామీలు తక్షణమే అమలు చేయాలని కోరుతూ శుక్రవారం కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్ సి.నారాయణరెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రాజ్భూపాల్గౌడ్ మాట్లాడుతూ.. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు కాలేదన్నారు. యువతకు జాబ్ క్యాలెండర్, నిరుద్యోగ భృతి, వృద్ధాప్య పెన్షన్లు, వితంతు పెన్షన్లు నేటికీ పెంచలేదన్నారు. కల్యాణలక్ష్మి, పేదలకు గృహ నిర్మాణ పథకం, రైతు భరోసా, రైతు బీమా కరువయ్యాయన్నారు. కాంగ్రెస్ మీద నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తే నేడు మోసం చేసిందని మండిపడ్డారు. ప్రభుత్వం నిర్లక్ష్యంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, భూభారతి రెవెన్యూ సదస్సుల్లో ప్రజలు దరఖాస్తులు సమర్పించినప్పటికీ వారి సమస్యలు ఇంకా పరిష్కారానికి నోచుకోవడం లేదన్నారు. గ్రామాల్లో అనేక సమస్యలు రాజ్యమేలుతున్నాయని పేర్కొన్నారు. పారిశుద్ధ్య నిర్వహణ, మౌలిక సదుపాయాలు, వీధి దీపాల వంటి ప్రాథమిక సదుపాయాలు కల్పించడం లేదన్నారు. ప్రజా సమస్యలపై బీజేపీ రాజీలేని పోరాటాలు చేస్తుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రత్నం, పార్టీ మాజీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి, నాయకులు పోరెడ్డి నర్సింహారెడ్డి, అందెల శ్రీరాములు యాదవ్, నారాయణయాదవ్, దయానంద్గౌడ్, నిట్టు శ్రీశైలం పాల్గొన్నారు.
బీజేపీ జిల్లా అధ్యక్షుడు రాజ్భూపాల్గౌడ్


