పసుపులో మట్టి ఎగవేత కీలకం
మోమిన్పేట: పసుపులో అధిక దిగుబడులు సాధించేందుకు మట్టి ఎగవేత తప్పనిసరని రైతులు పేర్కొంటున్నారు. ఒకప్పుడు నాగలి వెంట, ఆ తర్వాత బోజలపై, ప్రస్తుతం బెడ్ పద్ధతిపై సాగు చేస్తున్నారు. ఈసారి వర్షాలు అధికంగా కురవడంతో మట్టి కిందికి జారి పోయింది. దీంతో మొలకల వద్ద మట్టి లేకపోవడంతో కొమ్ములు వచ్చి అక్కడే ఆగిపోతున్నాయి. కొమ్ములు ముందుకు సాగకపోతే ఆశించిన దిగుబడులు రావని అన్నదాతలు చెబుతున్నారు. ఒక్కో ఎకరా పసుపు సాగుకు రూ.లక్షకు పైగానే పెట్టుబడి వస్తుంది. దిగుబడులు రాకుంటే నష్టాలే మిగులుతాయి. అందుకే మట్టి ఎగవేత కీలకంగా ఉంటుంది. కొమ్ములను మట్టితో నింపడంతో ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు. కూలీలతో మట్టి ఎగవేత ఖర్చుతో కూడుకున్న పని, దీనికి ప్రత్యామ్నాయంగా మినీ పవర్ టిల్లర్ ద్వారా మట్టిని ఎగవేస్తున్నారు. ఎకరాకు రూ.3వేలతో పని పూర్తవుతోందని కర్షకులు చెబుతున్నారు.


