మర్పల్లి: గ్రామ పంచాయతీల వార్డు సభ్యులు సర్పంచులకు సహకరిస్తూ గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందించాలని ఎంపీడీఓ శ్రీనివాస్ సూచించారు. ఐదు రోజులుగా మండల కేంద్రంలోని రైతు వేదికలో వార్డు సభ్యులకు ఇచ్చిన శిక్షణ శిబిరం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. ఈ సందర్భంగా ఎంపీడీఓ హాజరై మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి ఫలాలు పేదలకు అందే విధంగా పంచాయతీ పాలన కొనసాగాలన్నారు. గ్రామంలో ఏవైన సమస్యలు ఉంటే సర్పంచ్ దృష్టికి లేదా పంచాయతీ కార్యదర్శి దృష్టికి వార్డుసభ్యులు తీసుకు రావాలన్నారు. అనంతరం శిక్షణ శిబిరంలో పాల్గొన్న వార్డు సభ్యులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


