26న ప్రజా వ్యతిరేక విధానాలపై ధర్నా
అనంతగిరి: కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలకు నిరసనగా ఈ నెల 26న వికారాబాద్లో నిర్వహించే ధర్నాను జయప్రదం చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.వెంకటయ్య అన్నారు. ఈ మేరకు సోమవారం వికారాబాద్లోని సీఐటీయూ కార్యాలయంలో ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం 2021లో రైతులకు ఇచ్చిన రాతపూర్వక హామీలను అమలు చేయాలన్నారు. వరి సేకరణపై తేమ పరిమితిని 17 శాతం నుంచి 22 శాతానికి పెంచాలన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికులకు సమగ్ర రుణమాఫీ పథకాన్ని ప్రకటించాలన్నారు. మైక్రో ఫైనాన్స్ దోపిడీని నియంత్రించాలన్నారు. విద్యుత్, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రవేటీకరణ చేయొద్దన్నారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, జిల్లా నాయకులు మైపాల్, సుదర్శన్, సత్తయ్య, సతీష్, లాలప్ప తదితరులు పాల్గొన్నారు.


