ప్రభుత్వ ఆస్తి ధ్వంసంపై ఫిర్యాదు
తాండూరు టౌన్: పట్టణ మున్సిపల్ పరిధిలోని 7వ వార్డులో ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీజేపీ పట్టణాధ్యక్షుడు నాగారం మల్లేశం ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాయల్కాంట పక్క మార్గంలో గతంలో ఉన్న సీసీ రోడ్డును జేసీబీతో ధ్వంసం చేసిన వారిపై కేసు నమోదు చేయాలన్నారు. రోడ్లు వేయలేదనే కారణంగా ప్రభుత్వ ఆస్తులకు నష్టం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. అక్కడికి వచ్చిన అఽధికారులను దూషించడం, బెదిరించడం అప్రజాస్వామికమన్నారు. ప్రభుత్వం ఆస్తికి నష్టం చేసిన వారితో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఫోన్లో మాట్లాడి వెంటనే కొత్త సీసీ రోడ్డు వేస్తామని చెప్పడమేంటని, కారకులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పకపోవడం హాస్యాస్పదమన్నారు. ఇలా ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసుకుంటూ పోతే మిగిలేది శూన్యమేనన్నారు. వెంటనే పోలీసులు స్పందించి జేసీబీని సీజ్ చేయడంతో పాటు రోడ్డు ధ్వంసం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో పార్టీ నియోజకవర్గ కన్వీనర్ రజినీకాంత్, పట్టణ ఉపాధ్యక్షుడు కిరణ్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, ప్రహ్లాద్ తదితరులు తెలిపారు.
కారకులపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నేతల డిమాండ్
ముగ్గురిపై కేసు నమోదు
తాండూరు: మున్సిపల్ రోడ్డును ధ్వంసం చేసిన వారిపై తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పట్టణ సీఐ సంతోష్కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని రాయల్ కాంట పక్కన ఉన్న రోడ్డును అదే కాలనీకి చెందిన వారు శనివారం జేసీబీతో ధ్వంసం చేశారు. ఈ విషయమై బీజేపీ తాండూరు పట్టణ అధ్యక్షుడు నాగారం మల్లేశం, నాయకులతో కలిసి వచ్చి ఫిర్యాదు చేశారు. దీంతో ధ్వంసానికి పాల్పడిన అజావ్, నూర్, జావీద్లతో పాటు పలువురిపై కేసు నమోదు చేశామని సీఐ తెలిపారు.


