స్వెట్టర్లకు భలే గిరాకీ
● రోజురోజుకూ పడిపోతున్న ఉష్ణోగ్రతలు
● చలి నుంచి రక్షణ పొందేందుకుజోరుగా కొనుగోళ్లు
● నగర శివారులో వెలిసిన స్టాళ్లు
పహాడీషరీఫ్: రోజురోజుకూ కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండడంతో నగర శివారు ప్రజలు ఉపశమనం చూసుకుంటున్నారు. ముఖ్యంగా రాత్రి వేళల్లో చలి తీవ్రత అధికంగా ఉంటుండడంతో స్వెట్టర్లు, దుప్పట్లకు భలే గిరాకీ ఏర్పడింది. రాజస్థాన్, మధ్యప్రదేశ్, పంజాబ్ల నుంచి వీటిని కొనుగోలు చేసి వ్యాపారులు జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఎర్రకుంట, షాహిన్నగర్, పహాడీషరీఫ్ ప్రధాన రహదారులపై స్టాళ్లు ఏర్పాటు చేసి విక్రయిస్తున్నారు. పాత స్వెట్టర్లు ఉన్నప్పటికీ అవి చలిని తట్టుకోలేవన్న ఉద్దేశంతో చాలా మంది కొత్త స్వెట్టర్లను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. రూ.400ల నుంచి మొదలుకొంటున్న ఈ స్వెట్టర్లు రూ.1000 వరకు ధర పలుకుతున్నాయి. ముఖ్యంగా చిన్నారులకు సంబంధించిన స్వెట్టర్లను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు. దుప్పట్ల ధరలు కూడా రూ.300ల నుంచి రూ.600ల వరకు పలుకుతున్నాయి. ఉదయం వేళల్లో పారిశుద్ధ్య కార్మికులు స్వెట్టర్లు లేని కారణంగా చలి నుంచి ఉపశమనం పొందేందుకు రహదారులపై మంటలు కాసుకుంటూ కనిపిస్తున్నారు. ఇక టీ కొట్లు పెద్ద ఎత్తున జనంతో రద్దీగా కనిపిస్తున్నాయి.
కొత్త కొత్త డిజైన్లు
చలిలో కూడా తప్పనిసరి బయటికి వెళ్లాల్సిన వారి కోసం కొత్త కొత్త డిజైన్ల స్వెటర్లు అందుబాటులోకి వచ్చాయి. సాధారణ స్వెట్టర్లతో పాటు ప్రత్యేకంగా ఉన్ని.. కవర్తో కూడిన స్వెట్టర్లు విక్రయిస్తున్నారు. ఇక స్వెట్టర్లతో పాటు మంకీ క్యాప్లు, కేవలం చెవులకు మాత్రమే కవరయ్యేలా మఫ్లర్లు సరికొత్త డిజైన్లతో అందుబాటులో ఉన్నాయి. ఇక ఎలాంటి చలి బెంగ లేకుండా హాయిగా నిద్రపోయేలా మందంతో కూడిన ప్రత్యేకమైన దుప్పట్లు, రగ్గులు కూడా అందుబాటులో ఉన్నాయి. డిసెంబర్, జనవరి మాసాలలో చలి పులి మరింత పంజా విసరనున్న నేపథ్యంలో ప్రజలు ప్రతి ఒక్కరు ఇంటిల్లిపాది కోసం వీటిని కొనుగోలు చేస్తున్నారు.
ఆరు నెలల పాటు విక్రయాలు
మధ్యప్రదేశ్, రాజస్థాన్లకు చెందిన ప్రజలే ఈ స్వెటర్లను ఇక్కడికి వచ్చి విక్రయిస్తుంటారు. ప్రధాన రహదారుల పక్కన స్టాళ్లు ఏర్పాటు చేసుకొని ఏడాదిలో ఆరు నెలల పాటు విక్రయాలు కొనసాగిస్తుంటారు. వర్షాకాలం ఆరంభంలో ప్రారంభమయ్యే వీటి అమ్మకాలు చలికాలం ముగిసేంత వరకు కొనసాగిస్తారు. వర్షాకాలంలో రెయిన్ కోట్ లను విక్రయిస్తున్న వ్యాపారులు.. అది ముగియగానే శీతాకాల స్వెట్టర్లను విక్రయిస్తున్నారు. ఇలా ఆరేడు నెలల పాటు ఇక్కడే ఉంటున్న వ్యాపారులు మిగిలిన సమయంలో తమ స్వరాష్ట్రాలలో వ్యవసాయాలు చేసుకుంటామని వెల్లడించారు.
స్వెట్టర్లకు భలే గిరాకీ


