నవంబర్ 11 చీకటి రోజు
● లగచర్ల ఘటనలో రైతులపై పెట్టిన కేసులు ఎత్తివేయాలి
● నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపిన బాధితులు
దుద్యాల్: లగచర్ల, హకీంపేట్, పోలపల్లి, రోటిబండతండా, పులిచర్లకుంట తండాల రైతులకు నవంబర్ 11 చీకటి రోజు అని ఆయా గ్రామాలకు చెందిన బాధితులు వాపోయారు. లగచర్ల ఘటన జరిగి మంగళవారం ఏడాది పూర్తయిన సందర్భంగా ఆయా గ్రామాల్లోని ప్రధాన చౌరస్తాల వద్ద నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. లగచర్ల ఘటనలో 72 మందిపై కేసులు నమోదు చేసి, 38 మందిని జైలు పాలు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. జైలు శిక్ష అనుభవించి వచ్చిన తర్వాత చాలా మంది రైతులు ప్రభుత్వానికి భూములు ఇచ్చారని, అయినా కేసులు కొట్టేయలేదని తెలిపారు. పారిశ్రామిక వాడ ఏర్పాటుకు దాదాపు తొంభై శాతం మంది భూములు ఇచ్చారని, మరి కొంత మంది ఇవ్వకుండా ఉండడంతో వారి భూములను జనరల్ అవార్డు ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నారని, అలా చేయడం వల్ల రైతులు తీవ్రంగా నష్ట పోతారని తెలిపారు. ప్రాధన్యత కలిగిన భూములకు పరిహారం పెంచి ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రైతులు నరేశ్ గౌడ్, శివకుమార్, రాకం యాదయ్య, రమేశ్, బసప్ప, మాదరప్ప, రాము నాయక్, సాయి కుమార్, విష్ణవర్ధన్రెడ్డి, సేవ్యా నాయక్, విశాల్, మహేవ్, రాజు, తదితరులు పాల్గొన్నారు.


