బాలల హక్కులు కాపాడుదాం
కమిషన్ సభ్యులు దేవయ్య
వికారాబాద్ అర్బన్: ప్రతి ఒక్కరూ బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేయాలని బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యులు ఏ దేవయ్య అన్నారు. శుక్రవారం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బాలల సంరక్షణ కోసం చేపడుతున్న కార్యక్రమాలపై ఆయా శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బాల కార్మిక వ్యవస్థ, పోక్స్ చట్టం అమలు, జిల్లా స్థాయి బాలల హక్కుల పరిరక్షణ విభాగం పనితీరు బాగుండాలన్నారు. బాలల ఆరోగ్యం, విద్య వంటి అంశాలపై దృష్టి సారించాలన్నారు.
బాలికలు లైంగిక వేధింపులు, అత్యాచారాలకు గురికాకుండా పోక్సో చట్టం కఠినంగా అమలు చేయాలన్నారు. చట్టాలపై పాఠశాల, కళాశాల స్థాయి విద్యార్థులకు పూర్తి అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రత్యేకంగా యువత, ఆటో డ్రైవర్లు వంటి వారికి ప్రత్యేక అవగాహన కార్యక్రమం చేపట్టాలని సూచించారు. బాలికలపై అత్యాచారాలు జరిగితే వెంటనే విచారణ చేపట్టి వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రతి వసతి గృహంలో, పాఠశాలల్లో ఫిర్యాదుల బాక్స్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు.
జిల్లాలో గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్నందున బాల్యవివాహాలు కూడా అధికంగా అవుతున్నట్లు తెలిపారు. గ్రామీణ స్థాయిలో పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలన్నారు. విలేజ్ చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో డీఆర్ఓ అశోక్కుమార్, మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారి లలిత కుమారి, డీఈఓ రేణుకాదేవి, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ కోటాజీ, వెనుబడిన తరగతుల సంక్షేమ శాఖ అభివృద్ధి అధికారి మల్లేశం, అడిషనల్ ఎస్పీ మురళీధర్రావు తదితరులు పాల్గొన్నారు.