తిరుమల: తిరుమలలో మంగళవారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి. సోమ వారం అర్ధరాత్రి వరకు 88,210 మంది స్వామివారిని దర్శించుకున్నారు. 30,192 మంది భక్తులు తలనీలాలు అర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.23 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తు లకు సకాలంలో దర్శనం లభిస్తోంది. దర్శన టిక్కెట్లు లేని వారు స్వామిని దర్శించుకోవడాని కి 4 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవే శ దర్శనం టిక్కెట్లు కలిగిన వారు 1 గంటల్లో స్వామిని దర్శించుకోగలుగుతున్నారు. ఇదిలా ఉంటే సర్వదర్శనం టోకెన్లు కలిగిన భక్తులు నిర్దేశించిన సమయానికి మాత్రమే క్యూలోకి వెళ్లాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. కేటాయించిన సమయానికంటే ముందు వెళ్లిన వారిని క్యూలోకి అనుమతించరని స్పష్టంచేసింది.
నేటి నుంచి వీఆర్ఏల సహాయ నిరాకరణ
రామచంద్రాపురం: నేటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏలు సహాయ నిరాకరణ చేపట్టనున్నట్టు వీఆర్ఏల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు వెంకటేష్ తెలిపారు. ఈ మేరకు న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని, తెలంగాణ తరహాలో పే స్కేల్ అమలు చేయాలని కోరుతూ మంగళవారం స్థానిక తహసీల్దార్ మధుసూదన్రావుకు వినతి పత్రం అందజేశారు. వీఆర్ఏల అధ్యక్షుడు మాట్లాడుతూ ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న వీఆర్ఏల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. ప్రభుత్వం తమ డిమాండ్లను సానుకూలంగా పరిష్కరించే వరకు రాష్ట్ర వ్యాప్తంగా సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపడుతామని ఆయన స్పష్టం చేశారు.
తుది విడతపైనే ఆశలు
– నేడు చివరి విడత ఇంజినీరింగ్
ప్రవేశాల మెరిట్ లిస్ట్ విడుదల
తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ, డీమ్డ్, ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాల్లో పలు బీటెక్ కోర్సుల్లో మిగిలి ఉన్న సీట్ల భర్తీకి సాంకేతిక విద్యాశాఖ మూడవ, తుది విడత కౌన్సెలింగ్ ప్రక్రియకు సంబంధించి మెరిట్ లిస్ట్ను బుధవారం విడుదల చేయనుంది. చివరి విడతలో కన్వీనర్ కోటా సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో ఈనెల 19వ తేదీలోపు రిపోర్టు చేయాల్సి ఉంటుంది. కాగా ఇప్పటికే రెండు విడతల కౌన్సెలింగ్ ప్రక్రియ ముగిసినా చెప్పుకోదగ్గ స్థాయిలో ప్రవేశాలు లేకపోవడంతో మూడో విడత కౌన్సెలింగ్ ప్రక్రియను చేపట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ప్రయివేటు కళాశాలల పరిస్థితి దారుణం
జిల్లాలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల్లో మాత్రం ప్రవేశాలు 85 శాతం పైగా సీట్లు భర్తీ కాగా మిగిలిన ప్రైవేటు కళాశాల పరిస్థితి దారుణంగా ఉంది. జిల్లాలో రెండు విడతల్లో కన్వీనర్ కోటా కింద రెండు డీమ్డ్ వర్సిటీలలో 80 శాతం సీట్లు, ఐదు అటానమస్ కళాశాలల్లో 75 శాతం ప్రవేశాలు జరిగినట్లు సమాచారం. కాగా జిల్లాలోని 11 ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలల్లో ఇప్పటి వరకు పలు బీటెక్ కోర్సుల్లో 60 శాతం సీట్లు కూడా భర్తీ కాలేదని యాజమాన్యాలు వాపోతున్నాయి. కన్వీనర్ కోటా మూడో విడతపైనే ఆశలన్నీ పెట్టుకున్నట్లు తెలుస్తోంది. తుదివిడత అనంతరం జరిగే స్పాట్ అడ్మిషన్లకు సైతం ఈ ఏడాది అంతగా స్పందన ఉండకపోవచ్చని అధ్యాపకులు అంచనా వేస్తున్నారు.
భక్తుల సురక్షిత ప్రయాణమే లక్ష్యం
తిరుపతి మంగళం : భక్తుల సురక్షిత ప్రయాణమే లక్ష్యంగా డ్రైవర్లు వాహనాలు నడపాలని జిల్లా రవాణాశాఖాధికారి కొర్రపాటి మురళీమోహన్ ఆదేశించారు. మంగళవారం తిరుపతి జిల్లా రవాణా, పోలీస్ శాఖలు సమన్వయంతో ప్రత్యేక రహదారి భద్రతా చర్యలు చేపట్టారు. గత పది రోజులుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వస్తున్న 61 కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులను మోటార్ వెహికల్ ఇన్న్స్పెక్టర్లు తనిఖీలు నిర్వహించారు. పర్మిట్ లేకుండా ఉన్న మూడు వాహనాలు, వాణిజ్యపరమైన సరుకు తీసుకెళ్తున్న 18 వాహనాలు, అధిక చార్జీలు వసూలు చేస్తున్న 4 వాహనాలు, అలాగే మోటార్ వాహన నిబంధనలను ఉల్లంఘించిన మరో 36 వాహనాలపై కేసులు నమోదు చేసి మొత్తం రూ.6 లక్షల అపరాధ రుసుము వసూలు చేసినట్లు జిల్లా రవాణాశాఖాధికారి తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో తిరుపతి జిల్లా పరిధిలోని అన్ని చోట్ల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు విస్తృత తనిఖీలు చేపడుతున్నట్టు ఆయన పేర్కొన్నారు.


