వెంకటగిరి రూరల్: మండలంలోని గుండలముద్రం గ్రామంలో మరిన్ని మౌలిక సదుపాయాలు కల్పించి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు తనవంతు కృషి చేయనున్నట్లు తిరుపతి జిల్లా కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ హామీ ఇచ్చారు. పీ–4 కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, టీవీఎస్ శ్రీనివాసన్ సంస్థ ఆధ్వర్యంలో గుండ్లసముద్రం గిరిజన కాలనీలో రూ. 2.75 కోట్లతో నూతనంగా నిర్మించిన 25 నూతన గృహాలను స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణతో కలసి కలెక్టర్ వెంకటేశ్వర్ బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ గుండ్లసముద్రం గ్రామాన్ని శ్రీనివాసన్ సేవాసంస్థ గుర్తించి, గ్రామాభివృద్ధిపై దృష్టి సారించడం హర్షణీయమన్నారు. టీవీఎస్ శ్రీనివాసన్ సేవాసంస్థ మేనేజర్ పళణిస్వామి మాట్లాడుతూ 5 రాష్ట్రాల్లో 2500 గ్రామాల్లో తమ ట్రస్టు ద్వారా సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ సందీప్ రఘువాన్సీ, శ్రీకాళహస్తి ఆర్డీఓ భానుప్రకాష్, ప్రత్యేకాధికారి ప్రసాద్రావు, ట్రైబుల్ వెల్ఫేర్ అధికారి రాజు సోము, సీపీఓ రాజశేఖర్, తహసీల్దార్ నరసింహారావు, ఎంపీడీఓ గుణశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
నాలుగు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల సీజ్
సూళ్లూరుపేట: స్థానిక స్వర్ణా టోల్ఫ్లాజా వద్ద మంగళవారం అర్ధరాత్రి రవాణాశాఖాఽధికారులు నిర్వహించిన తనిఖీల్లో భద్రతా ప్రమాణాల నిబంధనలకు విరుద్ధంగా ఉన్న నాలుగు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను సూళ్లూరుపేట రవాణాఽశాఖాధికారి అనిల్కుమార్, ఉప రవాణాశాఖాధికారి ప్రసాద్ వర్మ సీజ్ చేశారు. ప్రయాణికుల భద్రతను దృష్టిలో ఉంచుకుని బస్సుల తనిఖీలు నిర్వహించగా రవాణాశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బస్సులను సీజ్ చేశామని తెలిపారు.


