తిరుపతి కల్చరల్: కోదండరామస్వామి తెప్పోత్సవాల్లో భాగంగా రెండో రోజైన మంగళవారం రాత్రి శ్రీరామచంద్ర పుష్కరిణిలో స్వామివారు విహరిస్తూ భక్తులకు కటాక్షించారు. తెప్పోత్సవంలో భాగంగా ఉదయం ఆలయంలో సుప్రభాతంతో స్వామివారిని మేల్కొలిపి తోమాలసేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం శాస్రోక్తంగా చేశారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీళ్లతో విశేషంగా అభిషేకం చేశారు. సాయంత్రం 6.30 గంటలకు సీతారామలక్ష్మణుల ఉత్సవమూర్తులను ఆలయం నుంచి ఊరేగింపుగా శ్రీరామచంద్ర పుష్కరిణికి వేంచేపు చేశారు. అక్కడ తెప్పపై సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారు ఆశీనులై పుష్కరిణిలో ఏడు చుట్లు ప్రదక్షిణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈఓ నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్ పాల్గొన్నారు.


