తిరుపతి కల్చరల్: కోదండరామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరో రోజైన ఆదివారం రాత్రి గజవాహనం జగదభిరాముడు ఊరేగుతూ భక్తులను కనువిందు చేశారు. ఉదయం 7 నుంచి 9 గంటల వరకు స్వామి వారి హనుమంత వాహన సేవ వేడుకగా సాగింది. అనంతరం ఉదయం 10.30 గంటలకు ఆలయ ఆవరణలోని కల్యాణ మండపంలో సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం వేడుకగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, డెప్యూటీ ఈవో నాగరత్న, టెంపుల్ ఇన్స్పెక్టర్ సురేష్, ఆలయ అర్చకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలోని సాంస్కృతిక వేదికపై ఆదివారం ప్రదర్శించిన పలు సంగీత, నృత్య కళా బృంద ప్రదర్శనలు భక్తులను అలరించాయి.


