తిరుపతి అర్బన్: వసతి గృహాల్లో అవసరం అయిన మేరకు వంట నిర్వాహకులతోపాటు ఇతర సిబ్బంది లేకపోవడంతో విద్యార్థులే పని మనుషుల అవతారం ఎత్తుతున్నారు. ఎవరైనా గుర్తించి ప్రశ్నిస్తే వెంటనే విద్యార్థులతో పనులు చేయించడం మానేస్తున్నారు. కొన్నాళ్ల తరువాత మళ్లీ అదే తంతు జరుగుతుంది. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని హాస్టళ్లలో అవసరం అయిన మేరకు సిబ్బందిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత వారిపై ఉందని పలువురు నిపుణులు అంటున్నారు. తిరుపతి చెన్నారెడ్డి కాలనీలోని ఇంటిగ్రేటెడ్ ఎస్సీ బాలుర హాస్టల్లో 9 మంది సిబ్బంది పనిచేయాల్సి ఉంది. అయితే కేవలం నలుగురు సిబ్బంది మాత్రమే ఉన్నారు. దీంతో హాస్టల్ విద్యార్థులతో పలు పనులు చేయించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో హాస్టల్లో ఒకప్పుడు 340 మంది విద్యార్థులు ఉండేవారు. ప్రస్తుతం 270 మందికి సంఖ్య పడిపోయింది.
విద్యార్థులకు పనులు చెప్పకండి
విద్యార్థులకు పనులు చెప్పకూడదని, అవసరం అయిన మేరకు సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దాసరి సువర్ణరాజు డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన హాస్టల్ విద్యార్థులతో మాట్లాడారు. అలాగే వార్డెన్లు అందుబాటులో ఉంటూ విద్యార్థులకు సరైన సమయంలో భోజనం అందించాలని సూచించారు. ఆయన వెంట వివిధ సంఘాలకు చెందిన నేతలు నరేష్, మునిశేఖర్ తదితరులు ఉన్నారు.


