పరిశోధనలకు టీం వర్క్ అవసరం
నారాయణవనం: ఇంజినీరింగ్ విద్యార్థులు సాంకేతిక పురోగతిని సాధించే క్రమంలో చేసే పరిశోధనలకు టీంవర్క్ ఎంతో అవసరమని సిద్ధార్థ గ్రూప్ ఆఫ్ ఇంజినీరింగ్ కళాశాలల చైర్మన్ డాక్టర్ అశోకరాజు అన్నారు. స్థానిక సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా సోమవారం 13 ఇంజినీరింగ్ బీటెక్ బ్రాంచీలతో పాటు ఎంబీఏ, ఎంసీఏ బ్రాంచ్ల విద్యార్థులు పవర్ పాయింట్, పేపర్ ప్రజెంటేషన్లు, జస్ట్ ఏ మినిట్, మిని ప్రాజెక్ట్ ఎక్స్పో, టెక్నికల్ క్విజ్, సర్క్యూట్ డీబగ్గింగ్, లోగో కాంపిట్ షన్, గ్రూప్ డిష్కషన్, ఫొటో కాంపిటిషన్, వర్డ్ ఫజల్, ప్రోమో తదితర పోటీలు నిర్వహించారు. మొదటి మూడు స్థానాల్లో నిచిలిన వారికి బహుమతులను అందజేశారు. చైర్మన్ అశోకరాజు మాట్లడుతూ వృత్తి విద్యలతో ఉనికిని చాటుకోవడానికి ఈ పోటీలు దోహదం చేస్తాయన్నారు. ఈ కార్యక్రమాల్లో ప్రిన్సిపాళ్లు మధు, జనార్దనరాజు పాల్గొన్నారు.
ఆస్పత్రుల్లో హెర్బల్ పార్కుల ఏర్పాటుకు కృషి
తిరుపతి తుడా: జిల్లా కేంద్రంలోని ప్రభుత్వాస్పత్రిలో హెర్బల్ పార్కుల ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు ఏపీ ఔషధ మొక్కలు, సుగంధ ద్రవ్యాల బోర్డు ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈఓ) ఆవుల చంద్రశేఖర్ వెల్లడించారు. తిరుపతి రుయా ఆస్పత్రిని ఆయన అధికారులతో కలసి సోమవారం సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రుయా ప్రాంగణంలో మొక్కల పెంపకానికి అనువైన నాలుగు స్థలాలను ఎంపిక చేశామన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో హెర్బల్ పార్కుతో పాటు, వాకింగ్ ట్రాక్, సీటింగ్ బెంచీలు, పూల మొక్కలు, తాగునీటి వసతి ఏర్పాటుచేస్తామన్నారు. ఇందుకోసం ప్రభుత్వ నిధులతోపాటు, పారిశ్రామికవేత్తలు, దాతలు, స్వచ్ఛంద సంస్థల మద్దతు తీసుకుంటామన్నారు. సీఈఓతోపాటు రుయా సూపరింటెండెంట్ డాక్టర్ జే రాధ, ఇంజినీర్ డి లావణ్య, ఆర్ జోత్స్న, అధికారులు డాక్టర్ హరికృష్ణ ఉన్నారు.
జాతీయ పోటీల్లో మహిళావర్సిటీ విద్యార్థిని ప్రతిభ
తిరుపతి రూరల్: తమిళనాడులో జరిగిన జాతీయస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పద్మావతీ మహిళా యూనివర్సిటీలో బీపీఎడ్ మొదటి సంవత్సరం చదువుతున్న పి రమ్య అత్యుత్తమ ప్రదర్శన కనబరిచినట్లు యూనివర్సిటీ వ్యాయామ విభాగ అధిపతి జి.సరోజినీ తెలిపారు. ఈ సందర్భంగా యూనివర్సిటీ వైస్చాన్సలర్ ఆచార్య ఉమ, రిజిస్టార్ ఆచార్య ఉషా సోమవారం ఆ విద్యార్థిని అభినందించారు.
పరిశోధనలకు టీం వర్క్ అవసరం


