
30న ముగియనున్న సైనిక్ స్కూల్ ప్రవేశాలకు దరఖాస్తు
తిరుపతి సిటీ: 2026–2027 విద్యా సంవత్సరానికి సంబంధించి సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష దరఖాస్తులకు ఈనెల 30వ తేదీ చివరి గడువుని విశ్వం విద్యాసంస్థల అధినేత, కోచింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడే డాక్టర్ విశ్వనాథ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 4వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు ప్రవేశ పరీక్షలకు అర్హులని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థుల తల్లిదండ్రులు ఉపయోగించుకోవాలని కోరారు. ప్రవేశ పరీక్ష విధానం, నమూనా ప్రశ్నలు, మాక్ టెస్టులు, కోచింగ్ వంటి మరిన్ని వివరాలకు వరదరాజనగర్లోని విశ్వం సైనిక్ నవోదయ పోటీ పరీక్షల కేంద్రాన్ని సంప్రదించాలని, లేదా 8688888802 /9399976999 నంబరులో సైతం సంప్రదించవచ్చని తెలిపారు. సైనిక్, నవోదయ ప్రవేశ పరీక్షల శిక్షణలో విశ్వం విద్యార్థులు గత కొన్నేళ్ల నుంచి అగ్రగామి సీట్లు సాధిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
మద్యం మత్తులో మీడియా ప్రతినిధిపై దాడి
చిల్లకూరు : తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని బనిగేసాహెబ్ పేట కూడలి వద్ద ముగ్గురు యువకులు స్థానికంగా ఉండే ఓ టీవీ రిపోర్టర్పై దాడికి పాల్పడిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. గూడూరు సమీపంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో చదివే ముగ్గురు విద్యార్థులు మద్యం తాగి గురువారం రాత్రి బైక్ నడుపుతుండగా బనిగేసాహెబ్ పేట కూడలి వద్ద అదుపు తప్పి కింద పడిపోయారు. తాగి అంత వేగంగా వెళ్లడం ఎందుకని అక్కడే ఉన్న ఓ టీవీ రిపోర్టర్ వారికి చెప్పే ప్రయత్నం చేశారు. ఈ తతంగాన్ని మీడియా ప్రతినిధి తన సెల్ఫోన్తో వారిని వీడియో తీసేందుకు ప్రయత్నించగా అతడి సెల్ఫోన్ లాక్కుని ముగ్గురు యువకులు మూకుమ్మడిగా మీడియా ప్రతినిధిపై దాడికి తెగబడ్డారు. దీంతో స్థానికులు వారిపై తిరుగుబాటు చేయడంతో మద్యం మత్తులో ఉన్న యువకులు అక్కడ నుంచి పారిపోయారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు మూడు రోజుల తరువాత స్పందించి యువకులను స్టేషన్కు పిలిచి విచారణ చేస్తున్నట్లు తెలిసింది.
తాగి వాహనం నడిపిన 26 మందిపై కేసు
నాయుడుపేటటౌన్ : నాయుడుపేట అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో మద్యం తాగి వాహనాలు నడుపుతున్న 26 మందిపై కేసులు నమోదు చేసి కోర్టుకు హాజరు పరిచారు. దీనిపై న్యాయమూర్తి విచారించి ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున మొత్తం 26 మందికి రూ.2.60 లక్షలు జరిమానా విధించినట్లు సీఐ బాబి తెలిపారు.
కారు ఢీకొని వ్యక్తి మృతి
చంద్రగిరి : రోడ్డు దాటుతున్న వ్యక్తిని కారు ఢీకొన్న ఘటనలో వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన పూతలపట్టు–నాయుడుపేట జాతీయ రహదారి మామండూరు సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. ఒడిస్సాకు చెందిర రుద్రప్రసాద్(33) ముంగళిపట్టు సమీపంలోని జగనన్న కాలనీలో తాపీ మేసీ్త్రగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం రాత్రి రుద్ర ప్రసాద్ మామండూరు వద్ద రోడ్డు దాటుతున్న క్రమంలో కారు ఢీకొనడంతో రోడ్డు పక్కన ఉన్న కాలువలో పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించగా, అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.