
నిధుల దుర్వినియోగంపై నిరసన
తిరుపతి రూరల్ : తిరుపతి రూరల్ మండలం చిగురువాడ పంచాయతీలో రూ.2.74 కోట్ల దుర్వినియోగంపైవార్డు సభ్యుడు ఎం.కిరణ్ కుమార్ రెడ్డి నిరసన తెలిపారు. సోమవారం ఈ మేరకు కలెక్టరేట్లో ఫిర్యాదు చేశారు. నిధుల దుర్వినియోగానికి పాల్పడిన సర్పంచ్ ప్రదీప్ కుమార్రెడ్డిపై చర్యలు తీసుకోవాలని వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. నిధుల దుర్వినియోగంపై గతంలో మాజీ ఉప సర్పంచ్ ఎ.సుబ్రమణ్యం రెడ్డి ఫిర్యాదు మేరకు రాష్ట్ర లోకాయుక్త విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేల్చిందన్నారు. అయితే బాధ్యులపై చర్యలు తీసుకోకుండా అప్పట్లో కేసును తప్పుదోవ పట్టించారని ఆరోపించారు. పంచాయతీ ఖర్చుల వివరాలు, చెల్లించిన బిల్లుల రికార్డులను పరిశీలిస్తే అవకతవకలు అర్థమవుతాయన్నారు. అందుకు అవసరమైన పత్రాలను అధికారులకు అందించారు. ఈక్రమంలోనే సర్పంచ్ అవినీతి, అక్రమాలపై డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, సీఎంఓకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. డీఎల్పీఓ నివేదిక ప్రకారం చిగురువాడ పంచాయతీలో రూ. 2.74 కోట్ల దుర్వినియోగం జరిగినట్లు నిర్ధారణ అయినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై మండిపడ్డారు. ఇప్పటికీ అధికారులు స్పందించకుంటే హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసి ఏసీబీ విచారణ కోరతానని స్పష్టం చేశారు. ఈ మేరకు అధికారులు మాట్లాడుతూ సమగ్ర విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.