
ఒకే బస్సు.. నలభై అడుగుల రోడ్డు!
● అభివృద్ధి పేరిట ఇళ్లకు మార్కింగ్ వేసిన అధికారులు ● నోటీసులు కూడా ఇవ్వకుండా కూల్చివేతలు
సాక్షి, టాస్క్ఫోర్స్ : కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి పేరిట అధికారులు చిత్రవిచిత్రాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే చంద్రగిరి మండలం ఐతేపల్లె– ఏ.రంగంపేట మార్గంలో ఒకే బస్సు తిరుగుతుంది. అక్కడ ట్రాఫిక్ ఇబ్బందులు ఏమాత్రం లేవు. అయితే రోడ్డు విస్తరణ పేరిట 5 రోజుల క్రితం రెవెన్యూ అధికారులు ఇళ్లకు మార్కింగ్ వేశారు. ఐతేపల్లె నుంచి ఏ.రంగంపేట వరకు 40 అడుగుల రోడ్డు పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు. దీనిపై స్థానికులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఏళ్ల నుంచి ఇళ్లు, దుకాణాలు నిర్మించుకుని ఇక్కడే జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు రోడ్డు విస్తరణ అంటూ కూల్చేస్తే తామంతా ఎలా బతకాలంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో అధికారులు మరో రెండు రోజుల్లో స్థానికులతో సమావేశం నిర్వహించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు వెల్లడించారు.
ఇష్టారాజ్యంగా దౌర్జన్యం
ఈ క్రమంలో సోమవారం అధికారులతో కలిసి కొంత మంది ఐతేపల్లైపె పడ్డారు ఆగమేఘాలపై జేసీబీలతో ఇష్టారాజ్యంగా ఇళ్లు, దుకాణాలను కూల్చేశారు. అసలు రోడ్డు విస్తరణకు పనులు ఎప్పుడు మంజూరు చేశారు..? వాటికి సంబంధించి అనుమతులు ఎవరు ఇచ్చారు..? అని ప్రశ్నిస్తే తమకు అదంతా తెలియదని, మార్కింగ్ చేసిన ప్రదేశం వరకు కూల్చేస్తామంటూ ధ్వంసం చేశారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదేం దారుణమని అడిగితే బెదిరింపులకు పాల్పడినట్లుగా స్థానికులు తెలిపారు. కనీసం ఇళ్లు, దుకాణాలు కోల్పోయే బాధితులకు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యం చేయడంపై మండిపడ్డారు.
ఎవరూ లేని సమయంలో..!
రోడ్డు విస్తరణ నిర్వాసితులకు ఎలాంటి పరిహారం గురించి చర్చింకుండా, ఇళ్లలో ఎవరూ లేని సమయంలో దౌర్జన్యంగా కూల్చివేత పనులను చేపట్టడంపై ఐతేపల్లె వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డుపై నిరసనకు దిగారు. దౌర్జన్యంగా కూల్చివేతలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వంపై ఎంతో నమ్మకంతో ఓట్లు వేసినందుకు మా పొట్టకొడుతున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మార్గంలో ఉదయం, సాయంత్రం కేవలం ఒక్క బస్సు మాత్రమే వస్తుందని, అలాంటిది 40 అడుగుల రోడ్డు ఎందుకని ప్రశ్నించారు. నిబంధనలకు పాటించకుండా దౌర్జన్యంగా కూల్చివేతలకు పాల్పడడం ఏంటని మండిపడ్డారు. బాధితులకు న్యాయం చేయకపోతే సహించేది లేదన్నారు.
జేసీ దృష్టిలోనే లేదంట..!
బాధితులు ఈ మేరకు సోమవారం ప్రజాసమస్యల పరిష్కార వేదికలో జేసీ శుభం భన్సల్కు వినతి పత్రం సమర్పించారు. తమ గ్రామంలో రోడ్డు విస్తరణ పేరుతో అన్యాయంగా ఇళ్లు, దుకాణాలు కూల్చేశారని, తమకు న్యాయం చేయాలంటూ వేడుకున్నారు. దీనిపై స్పందించిన జేసీ మాట్లాడుతూ రోడ్డు విస్తరణ పనులకు ఎలాంటి అనుమతులు ఇవ్వలేదని, వీటిపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు బాధితులు తెలిపారు.

ఒకే బస్సు.. నలభై అడుగుల రోడ్డు!