
గిట్టుబాటు ధర కల్పించాలని నిరసన
రోడ్డుపై బైఠాయించిన రైతులు
ధర తగ్గిస్తున్న దళారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్
● రోడ్డుపై బైఠాయించిన రైతులు ● ధర తగ్గిస్తున్న దళారులపై కేసులు నమోదు చేయాలని డిమాండ్
పాకాల: దళారులు, ఫ్యాక్టరీ యజమానులతో కుమ్మకై ్క మామిడికి గిట్టుబాటు ధర కల్పించడం లేదని మామిడి రైతులు పాకాల మండలం, దామలచెరువు హైస్కూల్ గేటు వద్ద మంగళవారం రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు. ర్యాంపుల వద్ద దళారులు ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.8,000కు కాకుండా కేవలం టన్నుకు రూ.4,000కు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వం నిర్ణయించిన ధరకే దళారులు, సప్లయర్స్, ఫ్యాక్టరీ యజమానులు కొనుగోలు చెయ్యాలని, రేటు తగ్గించి కొనుగోలు చేసే దళారులపై కేసులు నమోదు చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నుంచి అందాల్సిన రూ.4 వేలు నేరుగా రైతుకే అందే విధంగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. తోటల్లోనే మామిడి కాయలు మాగి పోతున్నాయని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన చెందారు. తక్కువ ధరకు తోతాపురి రకాన్ని కొనుగోలు చేయడంతో తోటలపై పెట్టిన పెట్టుబడులు కూడా రావడం లేదన్నారు. రోడ్డుపై బైఠాయించడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ సంతోష్సాయి, సీఐ సుదర్శన్ప్రసాద్ సంఘటనా స్థలానికి చేరుకుని రైతులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. సమస్య పరిష్కారం కాకపోతే మళ్లీ ధర్నా చేస్తామని మామిడి రైతులు హెచ్చరించారు.