
‘అయ్యో’ర్ల పడిగాపులు
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ఎస్జీటీలు బదిలీల కౌన్సెలింగ్ కోసం జిల్లా కేంద్రంలో పడిగాపులు కాశారు. రాత్రి 9.50 గంటల సమయం అయినప్పటికీ కౌన్సెలింగ్ను విద్యాశాఖ అధికారులు ప్రారంభించలేదు. ఈ కౌన్సెలింగ్కు హాజరైన ఎస్జీటీ టీచర్ల సీనియారిటీ ప్రకారం బదిలీలు నిర్వహించేందుకు విద్యాశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. టీచర్లు కౌన్సెలింగ్ కేంద్రంలో చీకటిలో కూర్చుని రాత్రంతా నిరీక్షించారు. రాష్ట్ర విద్యాశాఖ అధికారులు రాత్రి 9.20 గంటలకు ఎస్జీటీల సీనియారిటీ జాబితాను విడుదల చేశారు. ఆ జాబితాలో సమగ్ర సీనియారిటీ జాబితాను ప్రదర్శించాలని టీచర్లు డిమాండ్ చేశారు. అధికారులు 350 వరకు జాబితాను విడుదల చేసి మిన్నకుండి పోయారు. సమగ్ర సీనియారిటీ జాబితాను విడుదల చేస్తే బదిలీల్లో న్యాయం జరుగుతుందని పలువురు ఎస్జీటీలు వెల్లడించారు.
సంఘం నాయకులకు నో ఎంట్రీ
కౌన్సెలింగ్ నిర్వహించే సమయంలో టీచర్ల తరపున సమస్యలను పరిష్కరించుకునేందుకు వివిధ సంఘాలు పాల్గొనడం ఆనవాయితీ. అయితే ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్లో గతంలో ఎన్నడూ లేని విధంగా ఏ సంఘం నాయకులు హాల్లోకి రాకూడదని జిల్లా విద్యాశాఖ అధికారులు హుకుం జారీ చేశారు. ఎన్నడూ లేని వింత విధానాలను చిత్తూరు విద్యాశాఖ అధికారులు అమలు చేస్తున్నారని వివిధ సంఘ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంఘం నాయకులు ఇతర జిల్లాల్లో విచారించగా నాయకులను అనుమతిస్తున్నారని తెలిసింది.
నేడు ఎస్జీటీల బదిలీల కౌన్సెలింగ్
జిల్లాలోని ఎస్జీటీలకు నేటి నుంచి బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు చిత్తూరు డీఈఓ వరలక్ష్మి తెలిపారు. మంగళవారం రాత్రి ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ఎస్జీటీలు సీనియారిటీ జాబితా ప్రకారం సీరియల్ నం.351 నుంచి 700 వరకు ఉదయం 9.30 గంటలకు, సీరియల్ నం.701 నుంచి 1000 వరకు మధ్యాహ్నం రెండు గంటలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్టు తెలిపారు. ఎస్జీటీలు చిత్తూరు శర్మన్ పాఠశాలలో జరిగే కౌన్సెలింగ్ కు తప్పక హాజరు కావాలని డీఈఓ కోరారు.
రాత్రి 9.50 గంటలైనా ప్రారంభం కాని కౌన్సెలింగ్