అడ్మిషన్లు లేని అటానమస్‌! | - | Sakshi
Sakshi News home page

అడ్మిషన్లు లేని అటానమస్‌!

Jun 12 2025 7:31 AM | Updated on Jun 12 2025 7:31 AM

అడ్మి

అడ్మిషన్లు లేని అటానమస్‌!

ప్రతిష్టాత్మక టీటీడీ నిర్వహణలోని విద్యాలయాలు.. అటానమస్‌ హోదా దక్కింది.. సొంతంగా అడ్మిషన్లు చేపట్టే మహత్తర అవకాశం అందుబాటులోకి వచ్చింది. విద్యార్థులకు బంగరు భవితను అందించే మహద్భాగ్యం వరించింది. అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్న చందంగా పరిస్థితి తయారైంది. స్వయంప్రతిపత్తి హోదా ఫలాలను పిల్లలకు అందించే అదృష్టం.. అధికారుల అలసత్వంతో దూరమైంది. చివరకు ప్రవేశాలకు కరువై విద్యార్థులను వెతుక్కోవాల్సిన దుస్థితి దాపురించింది. పేరుకే అటానమస్‌.. పెత్తనం మాత్రం ప్రభుత్వం చేతిలోనే పెట్టేసిన పరిస్థితి తలెత్తింది. ఈ క్రమంలో టీటీడీ అధికారుల నిర్లక్ష్య వైఖరిపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. పేద బిడ్డల భవిష్యత్‌తో ఆడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

చిన్నచూపు బాధాకరం

అటానమస్‌ హోదా సాధించినా ఫలితం శూన్యం. హోదా ఫలాలను విద్యార్థులకు అందించాల్సిన బాధ్యత టీటీడీ యాజమాన్యానిదే. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో టీటీడీ కళాశాలలకు స్వయంప్రతిపత్తి హోదా వచ్చింది. ప్రస్తుతం విద్య వ్యవస్థను టీటీడీ చిన్న చూపు చూడటం బాధాకరం. తిరుపతిలో ఇప్పటివరకు ప్రభుత్వ కళాశాల లేదు. కేవలం టీటీడీ కళాశాలలపైనే పేద విద్యార్థులు ఆధారపడి ఉన్నారు. ఇప్పటి వరకు డిగ్రీ అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల కాకపోవడం దారుణం. – బి.ఓబుల్‌ రెడ్డి, వైఎస్సార్‌సీపీ

విద్యార్థి విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు, తిరుపతి

దిశగా అడుగులు వేయలేదు

నాక్‌ ఏ ప్లస్‌ గ్రేడ్‌ సాధించిన ఎస్పీడబ్లూ, ఎస్‌జీఎస్‌, ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలకు గత ప్రభుత్వ హయాంలో పూర్తి స్థాయి అటానమస్‌ హోదా వచ్చింది. కానీ అటానమస్‌ సాధించినా అడ్మిషన్ల విషయంలోనూ, పరిపాలనలోనూ స్వతహాగా నిర్ణయాలు తీసుకునే దిశగా టీటీడీ యాజమాన్యం అడుగులు వేయలేదు. హోదాను సద్వినియోగం చేసుకుని కళాశాల అభివృద్ధికి కృషి చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.

– చిన్నా, ఏఐఎస్‌ఏ జిల్లా కార్యదర్శి, తిరుపతి

ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం

తిరుపతిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు లేకపోవడం బాధాకరం. ప్రస్తుతం ఉన్న టీటీడీ కళాశాలలకు అటా నమస్‌ హోదా దక్కినా అధికారుల నిర్లక్ష్యంతో స్వతహాగా అడ్మిషన్లు చేపట్టలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతుల కోసం టీటీడీ అధికారులు ప్రయత్నించి ఉంటే అటానమస్‌ హోదాతో ఆయా కళాశాలలు అడ్మిషన్లు చేపట్టి మెరిట్‌ స్టూడెంట్స్‌కు అవకాశం దక్కేది. ఆన్‌లైన్‌ ద్వారా చేపట్టే ప్రవేశాలతో పేదలు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదముంది. – హేమాద్రి యాదవ్‌,

స్టూడెంట్స్‌ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు, తిరుపతి

తిరుపతి సిటీ : ప్రపంచ ప్రసిద్ధి ఆధ్మాత్మిక సంస్థ టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యాలయాలపై అధికారులు శీతకన్ను వేశారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన అటానమస్‌ హోదా సాధించి ఏడాది గడుస్తున్నా స్వయంప్రతిపత్తి ఫలాలు విద్యార్థులకు దక్కడం లేదు. ప్రస్తుతం అటానమస్‌ హోదాతో కొనసాగుతున్న ఎస్వీ ఆర్ట్స్‌, ఎస్పీడబ్ల్యూ, ఎస్‌జీఎస్‌ ఆర్ట్స్‌ కళాశాలల్లో సొంతంగా డిగ్రీ అడ్మిషన్లు చేపట్టే అవకాశముంది. అయితే టీటీడీ అధికారుల నిర్లక్ష్య ధోరణితో ప్రభుత్వ అనుమతి రాకపోవడం గమనార్హం. దీంతో ఈ ఏడాది సైతం ఉన్నత విద్యామండలి ఆదేశాలతో ఆన్‌లైన్‌ అడ్మిషన్లు, మాడ్యూల్‌ ఫర్‌ డిగ్రీ కాలేజస్‌ (ఓఏమ్‌డీసీ) ద్వారా రాష్ట్ర స్థాయి వెబ్‌కౌన్సిల్‌ విధానంలో డిగ్రీ ప్రవేశాలు చేపట్టనున్నారు. అటానమస్‌ హోదా అంటే కేవలం పరీక్షలను సొంతంగా నిర్వహించి ఫలితాలను విడుదల చేయడంతోనే అధికారులు సరిపెడుతున్నారు. దీంతో రాష్ట్ర స్థాయి ఓపెన్‌ కాంపిటీషన్‌లో పేద, గ్రామీణ విద్యార్థులకు అన్యాయం జరుగుతోంది. ఈ క్రమంలోనే పలువురు ఉన్నత విద్యకు దూరమవుతున్నారని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

ఫలితం శూన్యం

టీటీడీ ఆధ్వర్యంలో నడుస్తున్న మూడు డిగ్రీ కళాశాలలకు అటానమస్‌ హోదా దక్కినా వాటి ఫలాలను విద్యార్థులకు అందించే దిశగా అడుగులు వేయడంలో అధికారులు విఫలమయ్యారు. దీంతో స్వయంప్రతిపత్తి కేవలం పేరుకే పరిమితమైనట్లు పలువురు ఉద్యోగులు, అధ్యాపకులు పెదవి విరుస్తున్నారు. హోదాతో దాతలను ఆకర్షించి కళాశాలలో విద్యార్థులకు మరింత అధునాతన మౌలిక వసతులు, నూతన భవనాలు నిర్మించే అవకాశాన్ని టీటీడీ యాజమాన్యం కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధ్యాపకుల పరిస్థితి దయనీయం

టీటీడీ ఆధ్వర్యంలోని జూనియర్‌, పాలిటెక్నిక్‌, డిగ్రీ కళాశాలలో గత 25 ఏళ్లుగా పనిచేస్తున్న 180మంది తాత్కాలిక ఉద్యోగుల భవిష్యత్‌ అగమ్య గోచరంగా మారింది. టైం స్కేల్‌ లేదా శాశ్వత ఉద్యోగులుగానో టీటీడీ గుర్తించకుండా కాలయాపన చేస్తోంది. అటానమస్‌ హోదా లభించడంతో తమ జీవితాలలో వెలుగులు నిండినట్టేనని భావించిన తాత్కాలిక ఉద్యోగులకు చివరకు నిరాశే మిగిలింది. దీంతో వారి పరిస్థితి దయనీయంగా మారింది. టీటీడీ విద్యాసంస్థలలో 35ఏళ్లుగా నియామకాలు చేపట్టకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంలేదని పలువురు విమర్శిస్తున్నారు.

స్వయం ప్రతిపత్తి హోదా దక్కినా..

టీటీడీ విద్యాసంస్థల్లో ప్రవేశాలు కరువు

సొంతంగా డిగ్రీ అడ్మిషన్లు చేపట్టేందుకు ప్రభుత్వ అనుమతి కోరని అధికారులు

ఓమ్‌డీసీ ద్వారానే కసరత్తు

సాగుతోందంటున్న విద్యామండలి

అగమ్యగోచరంగా 180 మంది

తాత్కాలిక అధ్యాపకుల భవిత

టీటీడీ నిర్లక్ష్యంపై మండిపడుతున్న

విద్యార్థి సంఘాలు

ప్రతిష్ట పెరిగేది

అటానమస్‌ హోదాలో స్వయంగా అడ్మిషన్లకు అనుమతి లభించి ఉంటే కళాశాలల ప్రతిష్ట పెరిగేది. దీంతో ప్రతి అటానమస్‌ డిగ్రీ కళాశాలలో పేద విద్యార్థులకు సులువుగా అడ్మిషన్లు లభించి ఉన్నత విద్యను అభ్యసించే సౌలభ్యం ఉండేది. కానీ టీటీడీ నిర్లక్ష్యం కారణంగా పేద పిల్లలకు అన్యాయం జరిగింది. ఈ క్రమంలోనే కళాశాల సీట్లతో పాటు హాస్టల్‌ సీట్లను సైతం టీటీడీ పెంచాల్సిన అవసరముంది. – బి.స్రవంతి,

పీడీఎస్‌ఓ జిల్లా సభ్యులు, తిరుపతి

ఈ నెలలో నోటిఫికేషన్‌ వచ్చేనా?

ఉన్నత విద్యామండలి డిగ్రీ అడ్మిషన్ల కోసం కసరత్తుసాగిస్తోందని అధికారులు చెబుతున్నారు. ఇంటర్‌ రెగ్యులర్‌ ఫలితాలు విడుదలై 3 నెలలు గడిచింది. ఇంటర్‌ సప్లిమెంటరీ ఫలితాలు సైతం ఇటీవల విడుదలయ్యాయి. కానీ డబుల్‌ మేజర్‌ సబ్జెక్ట్‌ విధానం అమలు చేయాలనే ఉద్దేశంతో నియమించిన కమిటీ నివేదిక సైతం నెల క్రితం వచ్చేసింది. అయితే ఇప్పటికీ ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియకు నోటిఫికేషన్‌ విడుదల కాకపోవడం గమనార్హం. ఈ నెలలో అయినా నోటిఫికేషన్‌ విడుదలయ్యేనా అంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు అనధికారికంగా ఇప్పటికే సీట్ల భర్తీ ప్రక్రియకు శ్రీకారం చుట్టినట్లు సమాచారం. దీంతో ప్రభుత్వ, టీటీడీ విద్యాసంస్థలలో ప్రవేశాలకు భారీగా గండిపడే ప్రమాదం ఉంది.

అడ్మిషన్లు లేని అటానమస్‌!1
1/3

అడ్మిషన్లు లేని అటానమస్‌!

అడ్మిషన్లు లేని అటానమస్‌!2
2/3

అడ్మిషన్లు లేని అటానమస్‌!

అడ్మిషన్లు లేని అటానమస్‌!3
3/3

అడ్మిషన్లు లేని అటానమస్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement