తిరునగరం డ్రగ్స్‌ కలకలం! | - | Sakshi
Sakshi News home page

తిరునగరం డ్రగ్స్‌ కలకలం!

Jun 10 2025 7:18 AM | Updated on Jun 10 2025 7:41 AM

-

ఆధ్యాత్మిక క్షేత్రంలో మాదక ద్రవ్యాల కలవరం 

 కూటమి ప్రభుత్వంలో మసకబారిన తిరుపతి ప్రతిష్ట 

 అధికార పార్టీ నేతల అండతో స్మగ్లర్లుగా మారిన ఖాకీలు 

 ఇప్పటికే ఇద్దరిని అరెస్ట్‌ తెలంగాణ పోలీసులు 

గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో అక్రమ మద్యం, గంజాయిపై ఉక్కుపాదం 

అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడి సంకీర్తనలతో అలరారే తిరుపతి నగర ప్రతిష్ట మసకబారుతోంది. ప్రపంచ నలుమూలల నుంచి తరలివచ్చే భక్తులతో విలసిల్లే ఆధ్యాతి్మక క్షేత్రం మాదక ద్రవ్యాలకు అడ్డాగా మారిపోతోంది. సాక్షాత్తు వైకుంఠనాధుని పాదాల చెంత డ్రగ్స్‌ మహమ్మారి వికటాట్టహాసం చేస్తోంది. శాంతి భద్రతలు కాపాడాల్సిన ఖాకీలే కూటమి నేతల అండతో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతుండడం శ్రీవారి భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. 

తిరుపతి క్రైమ్‌: ఆధ్యాత్మిక నగరానికి మాదక ద్రవ్యాల మరకలు అంటుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా డ్రగ్స్‌ మాఫియా మూలాలు తిరుపతి నగరంలో దొరకడం కలవరపాటు గురిచేస్తోంది. ఇప్పటివరకు గంజాయి మాత్రమే సరఫరా అవుతుందనే వినికిడి ఉండగా.. ఇప్పుడు కొత్తగా కొకై న్‌, ఎపిడ్రిన్‌ వంటి డ్రగ్స్‌ కూడా లభిస్తుండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. తిరుపతి నుంచే హైదరాబాద్‌కు డ్రగ్స్‌ సరఫరా జరిగినట్లుగా కూకట్‌పల్లి పోలీసులు గుర్తించారు. 

ఇందులో తిరుపతికి చెందిన ఓ కానిస్టేబుల్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. దీంతో నగరంలో ప్రమాదకరమైన మాదక ద్రవ్యాల సరఫరా జరుగుతున్నాయనే విషయం బయటకు రావడంతో శ్రీవారి భక్తులు ఆవేదన చెందుతున్నారు. కూటమి సర్కారు వచ్చి ఏడాది అవుతుంది. ఇప్పటికే జిల్లాలో మద్యం, గంజాయి సరఫరా యథేచ్ఛగా సాగుతున్నాయి. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా పుణ్యక్షేత్రంలోనే అధిక సంఖ్యలో వైన్‌ షాపులు వెలిశాయి. మరోవైపు కూటమి నేతల కనుసన్నల్లో బెల్ట్‌ షాపులు ఏర్పాటయ్యాయి. ఇష్టానుసారం పర్మిట్‌ రూములకు అనుమతులు ఇచ్చి 24 గంటలూ మద్యం అమ్మకాలు సాగిస్తున్నారు.

ఎవరెవరు ఉన్నారో..?
ఇప్పటివరకు ఈ డ్రగ్స్‌ దందాలో హైదరాబాద్‌ పోలీసులు తిరుపతికి చెందిన కానిస్టేబుల్‌, హెడ్‌ కానిస్టేబుల్‌ ఉన్నట్లు గుర్తించారు. వీరు కాకుండా ఇంకెవరైనా ఖాకీలు ఉన్నారా ? అనే కోణంలో తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు సమాచారం. మత్తు పదార్థాలను కట్టడి చేయాల్సిన పోలీసులే నిందితులుగా మారుతున్నారంటే.. ఎంత పెద్ద మొత్తంలో నగదు చేతులు మారుతుందో ఆలోచించాల్సిన విషయం. అధికార పార్టీ నేతల అండదండలతోనే ఈ డ్రగ్స్‌ వ్యవహారంలోకి ఖాకీలు తలదూర్చినట్లు విశ్వనీయ సమాచారం. విషయం బయట పడగానే వీరిద్దరిపై జిల్లా పోలీసు ఉన్నతాధికారి చర్యలు చేపట్టారు. విధుల నుంచి పూర్తిగా తొలగించారు. అయితే డ్రగ్స్‌ మూలాలు ఎక్కడెక్కడ ఉన్నాయి ? ఈ దందాలో ఇంకా ఎవరి హస్తం అయినా ఉందా అనే దిశగా జిల్లా పోలీసులు విచారణ చేపట్టకపోవడం దురదృష్టకరం. ఇప్పటికై నా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరముంది.

గత ప్రభుత్వంలో పటిష్ట భద్రత
గత ఐదేళ్లలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం మాదక ద్రవ్యాలపై ఉక్కుపాదం మోపింది. నాటి సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చాలావరకు గంజాయి నిర్మూలనకు కృషి చేశారు. అక్రమ మద్యం, గంజాయి లేకుండా చేయడంలో సఫలీకృతమయ్యారు. తిరుపతి ప్రతిష్టను ఇనుమడింపజేశారు. అనునిత్యం తిరుపతి నగరంపై ప్రత్యేక దృష్టి సారించి భక్తులకు భరోసా కల్పించారు. అయితే కూటమి సర్కార్‌ వచ్చినప్పటి నుంచే ఆధ్యాత్మికక్షేత్రంలో అష్టదరిద్రాలు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల కొత్తగా మాదక ద్రవ్యాల విక్రయాలు కూడా మొదలయ్యాయి. వీటి మూలాలను కూకటి వేళ్లతో పెకిలించాల్సిన అవసరం ఎంతైనా ఉందని నగరవాసులు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement