
ప్రజా గొంతుకపై రెచ్చిపోయిన పచ్చ మూక
సాక్షి కార్యాలయంపై రాళ్లు రువి్వన గూండాలు
గేటుని తన్నుతూ.. లోపలికి చొరబడేందుకు యత్నం
టీడీసీ నేతల ఆధ్వర్యంలో దాడి
కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. ప్రజల తరఫున ప్రశ్నించే పత్రికపై కక్షగట్టింది. ఎవరో చేసిన వ్యాఖ్యలను సాక్షి మీడియాకు అంటగట్టేందుకు పన్నాగం పన్నింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అపోహలు సృష్టించేందుకు తెగబడింది. ఇదే అదునుగా ప్రజా గొంతుకను అణగదొక్కాలని పథకం వేసింది. అందులో భాగంగా పచ్చమూకను రెచ్చగొట్టింది. గూండాలను రంగంలోకి దించింది. సాక్షి కార్యాలయంపై దాడికి ఉసిగొల్పింది. సోమవారం సాయంత్రం ఈ మేరకు తిరుపతిలోని టీడీపీ నేతల ఆధ్వర్యంలో రేణిగుంటలోని సాక్షి యూనిట్ ఆఫీస్కు రౌడీమూక తరలివచ్చింది. గేటును తన్నుతూ లోపలికి చొరబడేందుకు యత్నించింది. రాళ్లు రువ్వుతూ భయానక వాతావరణం సృష్టించింది. అడ్డుకోబోయిన పోలీసులపై సైతం దౌర్జన్యానికి పాల్పడింది.
సాక్షి ప్రతినిధి, తిరుపతి : రేణిగుంటలోని తిరుపతి సాక్షి యూనిట్ కార్యాలయంపై సోమవారం సాయంత్రం టీడీపీ మూక దాడికి తెగబడడంపై పలువురు మేధావులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎవరో మాట్లాడిన మాటలను సాక్షి మీడియాకు చుట్టడడంపై మండిపడుతున్నారు. ప్రజాప్రతినిధులుగా ఉండి ఇంతటి అరాచకానికి పాల్పడడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దాడులతో సభ్య సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. ప్రజలతో మమేకమై, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం సాగిస్తున్న సాక్షి పత్రికను నిలువరించేందుకే కుట్రలు చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ప్రజల గొంతుకగా సేవలందిస్తున్న పత్రిక కార్యాలయంపై దాడి చేయడమంటే, జనంపై దాడి చేయడమే అని స్పష్టం చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే, కార్పొరేషన్ చైర్మన్లు, కార్పొరేటర్ల ఆధ్వర్యంలో రౌడీయిజం చేయడమేంటని నిలదీస్తున్నారు.
‘సాక్షి’పై దాడి సరికాదు
రాష్ట్రంలో సాక్షి కార్యాలయాలపై జరుగుతున్న దాడులు సరికాదు. ఆ టీవీలో ప్రసారమైన అంశంపై చానల్ యజమాన్యం వివరణ ఇచ్చింది. అయినప్పటికీ ఇలా కక్షగట్టి దాడి చేయడం పద్ధతి కాదు. ఉద్యోగులను భయాందోళన కలిగించాలనే ఉద్దేశంతో ఇలా చేస్తున్నారు.
– నాగరాజు, సీపీఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి
భౌతిక దాడులు అన్యాయం
‘సాక్షి’పై కక్షకట్టి భౌతికంగా దాడులు చేస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో ఖండించా లి కానీ కార్యాలయాలపై దాడి ఎంతవరకు సమంజసం. నిరసన పేరుతో భౌతిక దాడులకు పాల్పడుతున్నారు. దీంతో సంస్థ ఆస్తికి నష్టం కలుగుతుంది. అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులకు ఏం అవుతుందో అని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నా రు. – గంగరాజు, సీపీఎం చిత్తూరు జిల్లా కార్యదర్శి
మీడియా స్వేచ్ఛను అణిచివేసే కుట్ర
నిరంతరం ప్రజాపక్షాన నిలిచి సమాజంలో అరాచకాలను, అక్రమాలను అరికట్టేందుకు ప్రయత్నిస్తున్న సాక్షి మీడియాపై టీడీపీ నేతలు విచక్షణా రహితంగా దాడి చేయడం ప్రజా స్వరాన్ని, మీడియా స్వాతంత్య్రాన్ని ఆణిచివేసే కుట్ర. పత్రికా స్వేచ్ఛపై దాడులను ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించక కఠిన చర్యలు తీసుకోవాలి.
– ఎస్. జయచంద్ర,సీఐటీయూ తిరుపతి జిల్లా కార్యదర్శి
దాడి దుర్మార్గం
సాక్షి కార్యాలయాలపై టీడీపీ నేతలు దాడులకు పాల్పడడం దుర్మార్గమైన చర్య. టీడీపీ ప్రజావ్యతిరేక చర్యలకు పాల్పడడం విడ్డూరం. పొరబాటు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. పత్రికా కార్యాలయంపై దాడులకు పూనుకోవడం రాజ్యాంగ విరుద్ధం. పోలీసులు కేసు నమోదు చేయాలి. – వందవాసి నాగరాజు, సీపీఎం తిరుపతి జిల్లా కార్యదర్శి
సెక్షన్ 30 బేఖాతర్
రేణిగుంటలో ఈ నెల 1 నుంచి 30వ తేదీ వరకు సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉంది. ఈ చట్టం ప్రకారం ఆందోళనలు, నిరసనలు, ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించకూడదు. అయితే టీడీపీ నేతలు మాత్రం అధికారమే అండగా చట్టాన్ని అతిక్రమించారు. వందల మంది గూండాలతో కలిసి సాక్షి కార్యాలయం వద్దకు చేరుకున్నారు. ఇష్టారాజ్యంగా దాడికి యత్నించారు. రోడ్డుపై బైఠాయించారు. చివరకు పోలీసులపై సైతం రౌడీయిజం చేశారు. అయినప్పటికీ పోలీసులు మాత్రం తూతూమంత్రంగా చర్యలు చేపట్టారు. టీడీపీ నేతలను దాదాపు బతిమాలుకుంటూ సాక్షి కార్యాలయం వద్ద నుంచి పంపించారు.
రేణిగుంటలోని సాక్షి యూనిట్ కార్యాలయంపై పచ్చమూక వికృత చేష్టలను పాత్రికేయలోకం ఖండించింది. ప్రజా వాణిని వినిపించే పత్రికను అణచివేసేందుకే ఇలాంటి దిగజారుడు పనులకు దిగుతున్నారని భగ్గుమంది. దాడి చేసిన వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకోవాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని అన్ని మండల కేంద్రాల్లో సాక్షి విలేకర్లు ఆయా పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. రౌడీమూకపై కేసులు నమోదు చేయాలని కోరారు. ఇదిలా ఉండగా యాదమరి పోలీస్ స్టేషన్లో ఓ కానిస్టేబుల్ ఫిర్యాదు తీసుకునేందుకు నిరాకరిస్తూ దురుసుగా ప్రవర్తించారు.