
రమణీయం..రథోత్సవం
మాడవీధుల్లో సాగుతున్న రథోత్సవం
తిరుపతి కల్చరల్ : శ్రీగోవిందరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదో రోజు సోమవారం ఉదయం స్వామివారి రథోత్సవం రమణీయంగా సాగింది. ఉదయం 6.15 గంటలకు ప్రారంభమైన రథోత్సవం కర్నాల వీధి, భేరివీధి, గాంధీరోడ్డు మీదుగా ఆలయానికి చేరుకుంది. వేలాది మంది భక్తుల గోవింద నామస్మణల నడుమ వైభవంగా కొనసాగింది. అడుగడుగునా భక్తులు కర్పూర నీరాజనాలు సమర్పించారు. రథంపై ఉప్పు, మిరియాలు చల్లుతూ మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయంలో ఉదయం 10 నుంచి 12 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామి, నమ్మాళ్వార్ ఉత్సవర్లకు వేడుకగా స్నపన తిరుమంజనం జరిపించారు. సాయంత్రం 5.30 గంటలకు స్వామివారికి ఊంజల్ సేవ నిర్వహించారు. రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వైభవంగా అశ్వవాహన సేవ చేపట్టారు. భక్తజన బృందాల కోలాటాలు, భజనలతో ఆకట్టుకున్నారు. కార్యక్రమంలో పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి, ఎఫ్ఏ అండ్ సీఏఓ బాలాజీ, ఎస్ఈ–2 జగదీశ్వర్రెడ్డి, డిప్యూటీ ఈఓ వీఆర్ శాంతి పాల్గొన్నారు. ఈ క్రమంలోనే రథోత్సవంలో రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో భక్తులకు అరటి పండ్లు పంపిణీ చేశారు.
నేడు చక్రస్నానం
శ్రీగోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు (ఆళ్వార్ తీర్థం)లో స్నపన తిరుమంజనం, చక్రస్నానం నిర్వహించనున్నారు. సాయంత్రం 4.30 గంటలకు స్వామి, అమ్మవార్లు బంగారు తిరుచ్చిపై, చక్రతాళ్వార్ పల్లకిలో ఊరేగనున్నారు. రాత్రి 7 గంటలకు శ్రీవారు ఉభయ నాంచారులతో మాడ వీధుల్లో విహరించనున్నారు. రాత్రి 8.40 నుంచి 9.30 గంటల నడుమ ధ్వజావరోహణం, ఆస్థానంతో బ్రహ్మో త్సవాలు పరిపూర్ణం కానున్నాయి.