సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయం ముట్టడికి యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు ప్రయత్నించడంతో ఉద్రిక్తత నెలకొంది. వారిని పోలీసులు అడ్డుకోవడంతో కార్యాలయం వద్ద కొద్దిసేపు హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ కార్యకర్తలు ‘కాంగ్రెస్ జిందాబాద్’ అంటూ నినాదాలు చేశారు.
కాగా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను అవమానించడాన్ని నిరసిస్తూ యూత్ కాంగ్రెస్ ఈ ఆందోళన చేపట్టింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాజీనామా చేయాలని కార్యకర్తలు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో అమిత్ షా దిష్టిబొమ్మను కాంగ్రెస్ కార్యకర్తలు దగ్ధం చేశారు. అనంతరం, బీజేపీ కార్యాలయం వైపు దూసుకెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో, ఆందోళనకారులను పోలీసులు అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేయగా.. వారితో వాగ్వాదం జరిగింది.

గాంధీ భవన్ వద్ద హైటెన్షన్..
మరోవైపు.. కాసేపటి క్రితం బీజేపీ కార్యాలయం ముట్టడికి వెళ్లిన యూత్ కాంగ్రెస్ నేతలు.. బీజేపీ ఆఫీస్ గేట్లకు నల్లరంగు పూయడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. దీనికి ప్రతిగా గాంధీ భవన్ ముట్టడికి బీజేవైఎం నేతలు ప్రయత్నించారు. గాంధీ భవన్ వైపు వచ్చిన పలువురు బీజేవైఎం నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఇరువర్గాల ఆందోళనల నేపథ్యంలో గాంధీ భవన్పై దాడి జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా గాంధీ భవన్ చుట్టుపక్కల భారీగా పోలీసులను మోహరించారు. దీంతో ఆ ప్రాంతంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

ఇదీ చదవండి: తుక్కుగూడలో ‘ఆర్డీకర్’ తరహా అఘాయిత్యం


