పెళ్లికాని కాపురాలు ఇక ‘లెక్కల్లోకి’ ఎక్కనున్నాయి. సహజీవనం చేస్తున్న జంటలు సరికొత్త తరహా కుటుంబాలుగా పరి‘గణన’ పొందనున్నాయి. దీనికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన జనగణన మొదటి దశలో తొలి అడుగు పడనుంది. జన గణనలో భాగంగా ఇళ్ల వివరాలతో పాటు కుటుంబ సభ్యుల సంఖ్యను నమోదు చేసేందుకు కసరత్తు ప్రారంభమైంది. సహజీవనం చేస్తున్న జంటలను కూడా కుటుంబంగా గుర్తించాలని అధికారులు నిర్ణయించిన విషయం విదితమే. దీంతో ఈ లెక్కలు తమకు తెచి్చపెట్టే చిక్కులపై లివ్ ఇన్ కపుల్లో కొంత అటెన్షన్, మరికొంత టెన్షన్ మొదలైంది.
హైదరాబాద్: నగరంలో దాదాపు 2 దశాబ్దాల క్రితమే ఊపిరి పోసుకున్న సహజీవన సంస్కృతి కార్పొరేట్ కల్చర్తో మమేకమైపోతూ విస్తరించింది. విభిన్న ప్రాంతాల నుంచి వృత్తి ఉద్యోగాలు, వ్యాపకాల రీత్యా తరలి వస్తున్న యువతీ యువకులు రకరకాల కారణాల రీత్యా పెళ్లికి దూరంగా ఉంటూ కలిసి జీవించేందుకు అనుకూలమైనదిగా లివ్ ఇన్ రిలేషన్ షిప్ మార్గాన్ని ఎంచుకోవడం సర్వసాధారణంగా మారింది. కెరీర్ కోసం పెళ్లిని వాయిదా వేయాలనుకునే యువత లక్ష్యాల వేటకు ఇది బాగా అనుకూలించింది. దాంతో తొలుత ఐటీ అనుబంధ కంపెనీలలోనే బాగా కనిపించిన ఈ సంస్కృతి అలా అలా హాస్పిటాలిటీ, సినిమా, టీవీ, మోడలింగ్ తదితర రంగాలకూ వేగంగా విస్తరించింది. శేరిలింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, పోచారం, బంజారాహిల్స్ తదితర ప్రాంతాల్లో సహజీవనం చేస్తున్న జంటల సంఖ్య భారీగా ఉండవచ్చని అంచనా. ఈ కల్చ ర్ యువతకు కలిగించే సౌలభ్యాల సంగతి ఎలా ఉన్నా, దీని తాలూకు దుష్ప్రభావాలు పలు నేర ఘటనల రూపంలో తరచుగా వెలుగు చూస్తున్నాయి.
లెక్కకు చిక్కుతారా?
సాధారణంగా సహజీవనం చేసే జంటల్లో తమ వ్యవహారాన్ని పెద్దలకు తెలియనివ్వని వారే ఎక్కువగా ఉంటారు. జనగణనలో భాగంగా వీరికి సంబంధించిన వివరాలు అధికారికం అవుతాయని, అంటే ఇక తమ సంబంధం బహిరంగ రహస్యమే అవుతుందనే ఆందోళన వీరిలో ఉంది. వీరి వివరాలను తాము రహస్యంగా ఉంచుతామని అధికారులు ఇస్తున్న హామీని ఎంత వరకు విశ్వసిస్తారనేది చూడాలి.
మరోవైపు ఇటీవల న్యాయ స్థానాలు వెల్లడించిన పలు తీర్పులు.. సహజీవనం చేస్తున్న జంటలకు కొన్ని రకాల హక్కులను కూడా కల్పిస్తున్నాయి. కాబట్టి అధికారిక నమోదు ప్రయోజనకారి కాగలదని కూడా కొందరు లివ్ ఇన్ కపుల్ భావిస్తున్నారు. కలిసి ఉంటున్నప్పటికీ పెళ్లి విషయంలో భవిష్యత్తులో తమ బంధం విచ్ఛిన్నమైతే ఎలా? అప్పుడు వేరే వ్యక్తులను పెళ్లి చేసుకునేందుకు తమ ప్రస్తుత వివరాల నమోదు ప్రక్రియ అడ్డంకిగా మారవచ్చునేమో కదా? అనే భయమూ కొందరిలో కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో వీరిలో ఎందరు సహకరిస్తారు? అలా సహకరించేలా అధికారులు వారిలో ఎటువంటి విశ్వాసం కల్పిస్తారు? అనేది చూడాలి.
పోచారం ఐటీ కారిడార్కు..
సహజీవనం చేస్తున్న జంటలు విబేధాలు వస్తే ఎవరి దారిన వారు విడిపోతారు. ఇతర దేశా ల నుంచి ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్లోని పడమర ప్రాంతానికి విస్తరించిన లివింగ్ రిలేషన్షిప్ నెమ్మదిగా పోచారంలోని ఐటీ కారిడార్కు పాకింది. పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు రావడంతో ఈ కంపెనీలకు సమీపంలోని పలు భవనాల్లో సహజీవనం చేస్తు న్న జంటలు కనిపిస్తున్నాయి. జనగణనతో వీరిలో ఎలాంటి మార్పు వస్తుందో వేచి చూడాల్సిందే. పాత లెక్కల ప్రకారం పోచారం డివిజన్లో 60 వేల జనాభా ఉండగా, ఇప్పుడు లక్షన్నరకు చేరుకునే అవకాశం ఉంది. వీరిలో ఐటీ ఉద్యోగులే ఎక్కువని అంచనా.


