బెట్టింగ్‌ యాప్స్‌లో గెలిచిన డబ్బులు తీసుకోలేని పరిస్థితి..! | Two Young Mans Ends Life To Betting App | Sakshi
Sakshi News home page

బెట్టింగ్‌ యాప్స్‌లో గెలిచిన డబ్బులు తీసుకోలేని పరిస్థితి..!

Apr 21 2025 8:58 AM | Updated on Apr 21 2025 11:43 AM

Two Young Mans Ends Life To Betting App

గెలిచినప్పటికీ డబ్బు వెనక్కు తీసుకోలేని పరిస్థితి  

ప్రధాన సూత్రధారులందరూ చైనీయులే 

సిట్‌ ఏర్పాటు చేసినా సాగుతున్న దందా 

మూడు రోజుల్లో ఒకరి ఆత్మహత్య.. మరొకరి హత్య

ప్రత్యేక ఆల్గర్‌థెమ్‌తో పని చేస్తున్న బెట్టింగ్‌ యాప్స్‌  

సాక్షి, హైదరాబాద్‌: అత్తాపూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో గురువారం ఆత్మహత్య చేసుకున్న పవన్‌.. షాద్‌నగర్‌ ఠాణా పరిధిలో శనివారం వెలుగులోకి వచ్చిన సాయిరాహుల్‌ హత్య.. మూడు రోజుల వ్యవధిలోనే ఈ రెండు దారుణాలకు బెట్టింగ్‌ యాప్సే కారణం. ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు చేసినప్పటికీ... వీటి కార్యకలాపాలు మాత్రం ఆగట్లేదు. ఈ బెట్టింగ్, గేమింగ్స్‌ యాప్స్‌ వెనుక చైనీయులే ఉంటున్నారు. ఉత్తరాదిలోని మెట్రో నగరాల కేంద్రంగా, స్థానికులతో షెల్‌ కంపెనీలు ఏర్పాటు చేసి దందా నడిపిస్తున్నారు. ప్రత్యేక ఆల్గర్‌థెమ్‌ ఆ«ధారంగా పని చేసే ఈ యాప్స్‌ నిర్వాహకులకే లాభం చేకూర్చేలా పని చేస్తుంటాయి. వీటిలో డబ్బు వేయడానికి పరిమితులు లేకపోయినా.. డ్రా చేసుకోవడానికి మాత్రం పరిమితులు ఉంటాయి. ఇలా గెలిచినా, ఓడినా ఆ మొత్తం తమ అ«దీనంలోనే ఉండేలా డిజైన్‌ చేస్తున్నారు. 

మరో రెండు ప్రాణాలు బలి.. 
సీరియర్‌ ఐపీఎస్‌ అధికారి, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌ ప్రారంభించిన ‘హ్యాష్‌ ట్యాగ్‌ సే నో టు బెట్టింగ్‌ యాప్స్‌’ ప్రచారం తర్వాత ప్రభుత్వం ఈ బెట్టింగ్‌ యాప్స్‌ కేసుల దర్యాప్తు కోసం సిట్‌ ఏర్పాటు చేసింది. అయినప్పటికీ యాప్స్‌ తమ కార్యకలాపాలు మాత్రం ఆపలేదు. ఇప్పటికీ కొన్ని యాప్స్‌ ఆన్‌లైన్‌ ద్వారా తమ ప్రచారం కొనసాగిస్తున్నాయి. బెట్టింగ్‌కు బానిసగా మారిన యువకుడు అత్తాపూర్‌ పోలీసుస్టేషన్‌ పరిధిలో గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. కొన్నాళ్లుగా ఈ బెట్టింగ్‌కు అలవాటుపడిన పవన్‌ స్నేహితులు, బంధువులు, కుటుంబ సభ్యుల నుంచి డబ్బు తీసుకున్నాడు. చివరకు తాను ఎంతో ముచ్చటపడి ఖరీదు చేసుకున్న బుల్లెట్, ఐఫోన్‌ సైతం అమ్మేశాడు. బెట్టింగ్‌ విషయంలో నగరంలోని ఓ హాస్టల్‌లో ఉంటున్న సాయి రాహుల్, వెంకటేష్‌ మధ్య ఏర్పడిన వివాదం రాహుల్‌ ప్రాణాలు తీసే వరకు వెళ్లింది.  

ఓ చోట కంపెనీ, మరోచోట అకౌంట్లు.. 
ఈ గేమింగ్‌ యాప్స్‌లో లావాదేవీలన్నీ ఆన్‌లైన్‌లోనే జరుగుతాయి. ఈ నేపథ్యంలో కరెంట్‌ బ్యాంకు ఖాతాలు నిర్వాహకులకు అనివార్యం. చైనీయులకు నేరుగా ఖాతాలు తెరిచే అవకాశం లేకపోవడంతో దళారుల ద్వారా ఉత్తరాదికి చెందిన వారిని సంప్రదిస్తున్నారు. డమ్మీ డైరెక్టర్లను ఏర్పాటు చేసి షెల్‌ కంపెనీలు రిజిస్టర్‌ చేయించుకుంటున్నారు. ఓ నగరంలో కంపెనీ రిజిస్టర్‌ చేస్తే.. మరో నగరంలో దాని పేరుతో బ్యాంకు ఖాతాలను తెరుస్తున్నారు. డమ్మీ కంపెనీల పేరుతో వెబ్‌సైట్స్‌ను రిజిస్టర్‌ చేస్తున్నారు. వీటి ముసుగులోనే బెట్టింగ్, గేమింగ్‌ యాప్స్‌ నిర్వహిస్తున్నారు. ఆ కంపెనీల పేరుతోనే పేమెంట్‌ గేట్‌వేస్‌ అయిన కాష్‌ ఫ్రీ, పేటీఎం, రేజర్‌ పే, ఫోన్‌ పే, గూగుల్‌ పేలతో లావాదేవీలకు ఒప్పందాలు చేసుకున్నారు.  

లింకుల ద్వారానే యాప్స్‌ చలామణి.. 
ఈ యాప్స్‌ను నిర్వాహకులు ప్లేస్టోర్‌ లేదా యాప్‌ స్టోర్స్‌లో హోస్ట్‌ చేయట్లేదు. కేవలం టెలిగ్రాం, వాట్సాప్‌ గ్రూపుల ద్వారా లింకుల రూపంలో మాత్రమే చలామణి చేస్తున్నారు. ఈ లింకు ద్వారా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత యాక్టివేట్‌ చేసుకోవాల్సి ఉంటుంది. ఆపై అందులో నగదు నింపడాన్ని లోడింగ్‌గా పిలుస్తారు. ఒక వ్యక్తి, ఒక రోజు ఎంత మొత్తమైనా లోడ్‌ చేసుకోవచ్చు. ఎదుటి వ్యక్తికి తమ గేమ్‌కు బానిసలుగా మార్చడానికి గేమింగ్‌ కంపెనీలు పథకం ప్రకారం వ్యవహరిస్తున్నాయి. ఈ గేమ్స్‌ అన్నీ వాటి నిర్వాహకులు రూపొందించిన ప్రత్యేక ఆల్గర్‌థెమ్‌ ద్వారా నడుస్తుంటాయి. దాని ప్రకారం గేమ్‌ ఆడటం కొత్తగా ప్రారంభించిన వారి ఐపీ అడ్రస్‌ తదితర వివరాలను నిర్వాహకులు సంగ్రహిస్తారు. దీని ఆధారంగా తొలినాళ్లల్లో దాదాపు ప్రతి గేమ్‌లోనూ వాళ్లే గెలిచేలా చేసి బానిసలుగా మారుస్తారు. ఆపై గెలుపు–ఓటములు 3:7 రేషియోలో ఉండేలా ఆల్గర్‌థెమ్‌ పని చేస్తుంది.  

రోజుకు విత్‌డ్రా రూ.500.. 
ఈ బెట్టింగ్, గేమింగ్‌లో ఓ వ్యక్తి ఎంత మొత్త గెలిచాడనేది ఆయా యాప్స్‌కు సంబంధించిన వర్చువల్‌ అకౌంట్లలో కనిపిస్తూ ఉంటుంది. ఆ మొత్తాన్ని గేమింగ్‌లో వెచి్చంచడానికి పరిమితులు ఉండవు. విత్‌డ్రా చేసుకోవడానికి ఆ మొత్తాన్ని తొలుత యాప్‌ నుంచి బ్యాంకు ఖాతాలోకి బదిలీ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి మాత్రం నిర్వాహకులు పరిమితులు విధిస్తున్నారు. కనిష్టంగా రూ.500 నుంచి రూ.1000 వరకు మాత్రమే విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇస్తున్నారు. 

ఈ కారణంగా ఎవరైనా ఆయా గేమ్స్, బెట్టింగ్‌లో గెలిచినా.. డబ్బు డ్రా చేసుకోలేని పరిస్థితి ఉంటోంది. దీంతో అప్పటికే బానిసై ఉండటంతో ఆ మొత్తం వెచ్చించి ఆడటానికే ఆసక్తి చూపి నష్టపోతున్నారు. ఆర్థిక లావాదేవీలతో ముడిపడి ఉన్న ఆన్‌లైన్‌ గేమింగ్‌కు రాష్ట్రంలో అనుమతి లేదు. ఇక్కడ ఎవరైనా ఆ యాప్‌ను ఓపెన్‌ చేస్తే.. జీపీఎస్‌ ఆధారంగా విషయం గుర్తించే నిర్వాహకులు గేమ్‌కు అక్కడ అనుమతి లేదంటూ స్క్రీన్‌పై సందేశం కనిపించేలా చేస్తారు. అయితే ఫేక్‌ జీపీఎస్‌ యాప్స్‌ను ఇన్‌స్టల్‌ చేసుకుంటున్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement