TS Schools:ఈ ఏడాదీ విద్యావలంటీర్లు లేనట్టే..! | TS Schools: Vidya Volunteers Teaching May Be Not There In TS | Sakshi
Sakshi News home page

TS Schools:ఈ ఏడాదీ విద్యావలంటీర్లు లేనట్టే..!

Nov 9 2021 9:05 AM | Updated on Nov 9 2021 9:05 AM

TS Schools: Vidya Volunteers Teaching May Be Not There In TS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది దాదాపు 2.5 లక్షల మంది కొత్తగా చేరారు. అయితే ఉపాధ్యాయుల కేటాయింపులో ఈ లెక్కను కొలమానంగా తీసుకోలేమని పాఠశాల విద్యాశాఖ నిక్కచ్చిగా చెబుతోంది. విద్యార్థుల పెరుగుదలపై ఆ శాఖ ఇటీవల ప్రభుత్వానికి ఓ నివేదిక అంద జేసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగిందని నివేదికలో పేర్కొంది. తెలంగాణవ్యాప్తంగా 42,575 స్కూళ్లుం టే, ఇందులో 30,001 ప్రభుత్వ, 702 ప్రభుత్వ ఎయిడెడ్, 11,688 ప్రైవేటు, 184 ఇతర యాజ మాన్యాల స్కూళ్లున్నాయి.

వాస్తవానికి గతేడాది ప్రభుత్వ స్కూళ్లలో 28,37,635 మంది విద్యార్థులు ఉండగా, ఈ సంవత్సరం 22,26,329 మంది హాజరవుతున్నట్టు తెలిసింది. మిగిలిన ఆరు లక్షల మంది విద్యార్థులు ఇంకా పాఠశాలలకు, వసతి గృహాలకు రావాల్సి ఉంది. ప్రస్తుతం పాఠశాలకు వస్తున్న వారిలో కొత్తగా చేరిన వారి సంఖ్య దాదాపు 2.5 లక్షలు. వీళ్లంతా ప్రైవేటు స్కూళ్ల నుంచే వచ్చి నట్టు అధికారులు చెప్పారు.

ప్రభుత్వ స్కూళ్లలో వసతులు, విద్యా ప్రమాణాలు పెరగడం వల్లే విద్యార్థులు ఆకర్షితులయ్యారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఉపాధ్యాయులనూ పెంచాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. కనీసం విద్యా వలంటీర్లనైనా నియమించాలనే డిమాండ్‌ తెరమీదకొచ్చింది. 

వాళ్లుంటారా..? 
ప్రత్యేక పరిస్థితుల్లోనే ప్రభుత్వ స్కూళ్లలో చేరికలు పెరిగాయని అధికారులు చెబుతున్నారు. కరోనా వల్ల అక్టోబర్‌ చివరి వరకూ ప్రైవేటు స్కూళ్లలో ప్రత్యక్ష తరగతులు సరిగా జరగలేదు. స్కూళ్లు తెరిచినా ఊళ్లకెళ్లిన పేద, మధ్య తరగతి వర్గాలు తిరిగి పట్టణాలకు రాలేదు. మరోవైపు ప్రైవేటు విద్యా సంస్థలు ఫీజుల కోసం ఒత్తిడి చేస్తున్నాయి. ఆర్థికంగా చితికిపోయిన కుటుంబాలు ఫీజులు కట్టేందుకు వెనకాడుతున్నాయి.

ఈ కారణాల వల్ల ఎక్కువ మంది అందుబాటులో ఉన్న ప్రభుత్వ స్కూళ్లలో తమ పిల్లలను చేర్పించారు. దీనివల్లే సర్కారీ స్కూళ్లలో చేరికలు పెరిగాయని అంటు న్నారు. ప్రతీ ఏడాది మాదిరే ఈసారీ కొంతమంది ప్రభుత్వ స్కూళ్ల నుంచి ప్రైవేటుకు వెళ్లారని అధికా రులు తెలిపారు. కొత్తగా చేరిన విద్యార్థులు వచ్చే విద్యా సంవత్సరంలోనూ తమ వద్దే ఉంటారన్న నమ్మకం ఏమిటనే సందేహం విద్యాశాఖ వ్యక్తం చేస్తోంది. అందువల్లనే హేతుబద్ధీకరణ ప్రక్రియను వాయిదా వేసినట్టు చెబుతున్నారు.

ఏడాదంతా ఇంతేనా?
రేషనలైజేషన్‌కు సంబంధించిన మార్గదర్శకాలను విద్యాశాఖ గత ఆగస్టులోనే విడుదల చేసింది. వాస్తవ సంఖ్య తెలిస్తేనే ప్రభుత్వ స్కూళ్లు, టీచర్ల హేతుబద్ధీకరణ సాధ్యమంది. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తిపైనా స్పష్టత ఇచ్చింది. ముఖ్యంగా 1 నుంచి 5 తరగతుల విషయంలో ఉపాధ్యాయుల కొరతను తీర్చేలా మార్గదర్శకాల్లో పేర్కొంది. పెరిగిన విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఈ తరగతుల మధ్యే ఉండటం వల్ల ఇప్పటికిప్పుడు రేషనలైజేషన్‌ సాధ్యం కాదని చెప్పింది.

దీన్నిబట్టి విద్యా వలంటీర్ల నియామకం కూడా సరైంది కాదంది. ఈ ఏడాది మొత్తం స్థానిక సర్దుబాటు ద్వారానే ఉపాధ్యాయుల సేవలు వాడుకోవాలని ఆదేశాలు ఇచ్చింది. దీన్నిబట్టి ప్రస్తుత విద్యా సంవత్సరం వరకు ఉపాధ్యాయుల సర్దుబాటే తప్ప, ఎలాంటి మార్పునకు అవకాశం లేదని విద్యాశాఖ తన నివేదికలో స్పష్టంచేసింది.

Advertisement
 
Advertisement
Advertisement