బీసీ సీఎం కావడానికి సమయం ఆసన్నమైంది | TPCC President Mahesh Goud sensational comments | Sakshi
Sakshi News home page

బీసీ సీఎం కావడానికి సమయం ఆసన్నమైంది

Jun 15 2025 2:15 AM | Updated on Jun 15 2025 2:15 AM

TPCC President Mahesh Goud sensational comments

టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌ గౌడ్‌ వ్యాఖ్యలు

దక్షిణాదిలో తెలుగు రాష్ట్రాల్లోనే బీసీలు సీఎం కాలేదు

భవిష్యత్తులో ఈ అవకాశం వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి

బీసీలందరూ ఐక్యంగా ఉంటే రాజ్యాధికారం వస్తుందని వెల్లడి

ఓబీసీల పోరుబాట పుస్తకావిష్కరణ సభలో ప్రసంగం

హాజరైన ఎంపీ ఈటల, ఎమ్మెల్సీలు దాసోజు, అద్దంకి

నాంపల్లి (హైదరాబాద్‌): రాష్ట్రంలో బీసీలు ముఖ్యమంత్రి కావడానికి సమయం ఆసన్నమైందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘బీసీలకు సీఎం పదవి వచ్చే రోజులు ముందున్నాయి. వస్తాయి కూ­డా. ఆ సమయం దగ్గరైంది. బీసీలందరూ ఐక్యంగా ఉంటేనే రాజ్యాధికారం వస్తుంది. ఈ పదవి కోసం ఏళ్లు గడిచాయి. 80ఏళ్లుగా అడుగుతున్నాం. దక్షిణాదిలో చాలా రాష్ట్రాల్లో బీసీ­లు ముఖ్యమంత్రులయ్యారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో బీసీ ముఖ్యమంత్రులు అయ్యారు. 

కానీ మన తెలు­గు రాష్ట్రాల్లోనే కాలేదు. ఈ అవకాశం భవిష్యత్తులో వస్తుంది. వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఇవాళో, రేపో, మాపో అని చెప్పలేను కానీ భవిష్యత్తులో అవకాశం వస్తుందని గట్టి చెప్తున్నాను. ఆ ఆకాంక్ష, కోరిక మన వర్గాల్లో ఎక్కువగా ఉంది’ అని అన్నారు. శనివారం తెలుగు విశ్వవిద్యాలయంలో జరిగిన ఓబీసీల పోరుబాట పుస్తకావిష్కరణ కార్యక్రమంలో మహేశ్‌ గౌడ్‌ ప్రసంగించారు. రాజకీయంగా మనకు కావాల్సింది ఆ పదవులు ఈ పదవులు కాదని, రాష్ట్రంలో ముఖ్యమైన పదవి రావాలని అన్నారు. 

ఈటల లీడ్‌ చేస్తే కేంద్రాన్ని అడుగుదాం..
బీసీలంతా కులాలు పక్కనపెట్టి, రాజకీయ పార్టీలకు అతీతంగా హక్కుల కోసం ఉద్యమించాలని మహేశ్‌ గౌడ్‌ కోరారు. రాష్ట్రంలో సీఎం రేవంత్‌ రెడ్డి సారథ్యంలో జరిగిన కుల గణన సర్వే శాస్త్రీయంగా ఉందన్నారు. బీసీలకు విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ చట్టసభల్లో రెండు బిల్లులను ఆమోదించామన్నారు. ‘ఎంపీ ఈటల రాజేందర్‌కు విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ప్రభుత్వం కేంద్రంలో ఉంది. 

మీరు లీడ్‌ చేస్తే మీ నాయకత్వంలో మేమంతా ఢిల్లీకి రావడానికి సిద్ధంగా ఉన్నాం. అందరం కలిసి ఈ బిల్లులను తొమ్మిదో షెడ్యూల్‌లో చేర్చడానికి ప్రయత్నం చేద్దాం. కేంద్రంపై ఒత్తిడి తెద్దాం. కేంద్ర మంత్రిగా మన రాష్ట్రం నుంచి బండి సంజయ్‌ ఉన్నారు. అందరం కలిసి వెళ్దాం. మా ముఖ్యమంత్రిని తీసుకొస్తాను.. ప్రధానమంత్రి అపాయింట్‌మెంట్‌ తీసుకోండి. అక్కడ విజయం సాధిస్తే అందరికీ ఆ వాటా పొందేందుకు అవకాశం మెండుగా ఉంటుంది’ అని అన్నారు. 

రాజ్యాధికారమే అంతిమ లక్ష్యం కావాలి
ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని మధ్యప్రదేశ్‌ ప్రజారోగ్య శాఖ ముఖ్యకార్యదర్శి పి.నరహరి, హైకోర్టు న్యాయవాది పృధ్వీ­రాజ్‌ రచించారు. కార్యక్రమంలో పి.నరహరి మాట్లాడుతూ.. రాజ్యాధికారమే ఓబీసీల అంతిమ లక్ష్యం కావాలని, ఆ దిశ­గా ఓబీసీలందరూ సంఘటితం కావాలని పిలుపునిచ్చారు. దేశమంతటా ప్రస్తుతం బీసీల గురించే చర్చ జరుగుతోందని, తెలంగాణలోనూ బీసీల గురించి యువత, మేధావులు ఆలోచిస్తున్నారని చెప్పారు. దేశంలోని 80 కోట్ల ఓబీసీల ఆశయాలు, ఆశలు, సమస్యలు, వాటి పరిష్కారాలపై ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని రచించినట్లు తెలిపారు. 

భరోసా కల్పించే నాయకత్వం రావాలి: ఈటల
సమాజహితం కోసం ఐఏఎస్‌ అధికారి పి.నరహరి ఓబీసీల పోరుబాట పుస్తకాన్ని రాయడం అభినందనీయమని ఎంపీ ఈటల రాజేందర్‌ అన్నారు. రాజ్యాంగ స్ఫూర్తిని పాలకులు సంపూర్ణంగా అమలు చేయడంతోనే ఏబీసీడీ వంటి ఉద్యమాలు తలెత్తుతున్నాయని చెప్పారు. బీసీల్లో చైతన్యం, సామాజిక స్పృహ ఉందని, బలహీన వర్గాలకు తాను ఉన్నానంటూ భరోసా కల్పించే నాయకత్వమే రావాలని ఆకాంక్షించారు. 

అగ్రకుల ఆధిపత్యాన్ని సవాలు చేస్తూ తమిళనాడులో పెరియార్‌ రామస్వామి నాయకర్‌ ప్రారంభించిన నల్ల చొక్కాల ఉద్యమం ఘన విజయం సాధించిందని, ఇలాగే తెలుగు రాష్ట్రాల్లో కూడా మరో నల్ల చొక్కా ఉద్యమం రావాల్సిన తరుణం ఆసన్నమైందని మాజీ డీజీపీ డాక్టర్‌ జె.పూర్ణచంద్రరావు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, అద్దంకి దయాకర్, టీఎస్‌ఎండీసీ చైర్మన్‌ అనిల్‌కుమార్, రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి చిరంజీవులు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement