బడ్జెట్‌లో కేంద్రం వివక్షపై యుద్ధం | TPCC Chief Mahesh Kumar Goud Shocking Comments | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌లో కేంద్రం వివక్షపై యుద్ధం

Feb 3 2025 5:35 AM | Updated on Feb 3 2025 5:35 AM

TPCC Chief Mahesh Kumar Goud Shocking Comments

అంబేడ్కర్‌ విగ్రహం సాక్షిగా ప్రకటిస్తున్నాం 

కాంగ్రెస్‌ ధర్నాలో పార్టీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌

8 మంది చొప్పున బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలను గెలిపిస్తే రాష్ట్రానికి ఇచ్చింది గాడిద గుడ్డే 

బీజేపీ ఎంపీలకు తెలంగాణ డీఎన్‌ఏ ఉంటే ఇప్పటికైనా గొంతెత్తాలి.. కిషన్‌రెడ్డి, సంజయ్‌ రాజీనామా చేయాలని డిమాండ్‌ 

నేడు జిల్లా కేంద్రాల్లో నిరసనలకు పిలుపు

సాక్షి, హైదరాబాద్‌: బడ్జెట్‌లో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వివక్ష వైఖరికి నిరసనగా అంబేడ్కర్‌ విగ్రహం సాక్షిగా యుద్ధం ప్రకటిస్తున్నామని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ చెప్పారు. తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే ప్రతి పౌరుడూ తమతో కలిసి రావాలని ఆయన పిలుపునిచ్చారు. ‘దేశమంటే మట్టి కాదోయ్‌..’ అంటూ తెలుగు గేయాన్ని గుర్తుచేసి.. తెలుగు ప్రజల ఆకాంక్షలకు, తెలుగు నేల అభివృద్ధికి బడ్జెట్‌లో మొండిచేయి చూపారని మండిపడ్డారు. తెలంగాణ ప్రజలు బీజేపీని ఎప్పటికీ క్షమించరని అన్నారు. కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి అన్యాయం జరిగిందని పేర్కొంటూ.. ఆదివారం ట్యాంక్‌బండ్‌ వద్ద కాంగ్రెస్‌ పార్టీ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. 

బీజేపీ సవతి ప్రేమకు నిదర్శనం 
తెలుగింటి కోడలు నిర్మలా సీతారామన్‌.. దేశ సమగ్రాభివృద్ధికి కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం బడ్జెట్‌ కేటాయింపులు చేసినట్లు ఉందని మహేశ్‌గౌడ్‌ ధ్వజమెత్తారు. తెలంగాణ విషయంలో బీజేపీ సవతి ప్రేమను అవి తెలియజేస్తున్నాయని విమర్శించారు. రాష్ట్రం నుంచి లక్షల కోట్ల రూపాయల పన్నులు తీసుకుంటున్న కేంద్రం, కనీసం రూ.40 వేల కోట్లు కూడా రాష్ట్రానికి కేటాయించకపోవడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి చెందిన 8 మంది ఎమ్మెల్యేలు, 8 మంది ఎంపీలను గెలిపిస్తే.. రాష్ట్రానికి కేంద్రం గాడిద గుడ్డు ఇచి్చందని వ్యాఖ్యానించారు. రాష్ట్రం నుంచి కేంద్ర మంత్రివర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న కిషన్‌రెడ్డి, సంజయ్‌లకు తెలంగాణ అభివృద్ధి పట్టదా అని నిలదీశారు. రాష్ట్రంపై ప్రేమ ఉంటే వారు వెంటనే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్రం కక్షపూరిత వైఖరికి నిరసనగా రాజకీయాలకతీతంగా తెలంగాణ వాదులు ఏకతాటి పైకి రావాలని మహేశ్‌గౌడ్‌ విజ్ఞప్తి చేశారు.  

అప్పుడు అడగలేదన్నారు.. ఇప్పుడు అడుగుతున్నా మొండిచెయ్యే 
బీజేపీ ఎంపీల్లో తెలంగాణ డీఎన్‌ఏ ఉంటే ఇప్పటికైనా గొంతెత్తాలని రాష్ట్ర బీసీ సంక్షేమం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. నిధులు అడగడం లేదని పదేళ్లుగా చెప్పుకొచ్చారని, ఇప్పుడు అడుగుతున్నా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మాట్లాడుతూ.. తెలంగాణ అంటే బీజేపీకి ద్వేషమని వ్యాఖ్యానించారు. బీజేపీ ప్రభుత్వం పెట్టింది స్వార్థపూరిత బడ్జెట్‌ అని విమర్శించారు. ఇది ఆరంభం మాత్రమేనని, ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ దగ్గర కూడా నిరసన తెలియజేస్తామని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ చెప్పారు.

ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు అనిల్‌కుమార్‌ యాదవ్, ఎమ్మెల్యేలు శ్రీగణేశ్, ఈర్లపల్లి శంకర్, నాగరాజు, ఎమ్మెల్సీలు బల్మూరి వెంకట్‌రావు, ఎగ్గె మల్లేశం, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి ఎస్‌. సంపత్‌కుమార్, ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ చిన్నారెడ్డి, డీసీసీ అధ్యక్షుడు రోహిణ్‌రెడ్డి, కార్పొరేషన్‌ చైర్మన్లు మెట్టు సాయికుమార్, మల్‌రెడ్డి రాంరెడ్డి, చల్లా నర్సింహారెడ్డి, నాగరిగారి ప్రీతం, రియాజ్, టీపీసీసీ మీడియా విభాగం చైర్మన్‌ సామా రామ్మోహన్‌రెడ్డి, యూత్‌ కాంగ్రెస్, ఎన్‌ఎస్‌యూఐల రాష్ట్ర అధ్యక్షులు శివచరణ్‌రెడ్డి, వెంకటస్వామి, సేవాదళ్‌ చైర్మన్‌ మిద్దెల జితేందర్, మహిళా కాంగ్రెస్‌ నాయకులు సునీతారావు  పాల్గొన్నారు.  

మోదీ, నిర్మల దిష్టిబోమ్మలు దగ్ధం చేయండి 
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు జరిగిన అన్యాయానికి నిరసనగా పార్టీ ఆధ్వర్యంలో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని టీపీసీసీ పిలుపునిచి్చంది. ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్‌ చైర్మన్లు, ముఖ్య నేతలంతా పాల్గొనాలని, ప్రధాని మోదీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ల దిష్టి»ొమ్మలు దగ్ధం చేయాలని పార్టీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్‌ ఒక ప్రకటనలో విజ్ఞప్తి చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement